రేవంత్రెడ్డి నీవు మొగోడివి అయితే.. ఆ 6 గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు : కేటీఆర్
రేవంత్రెడ్డి నీవు మొగోడివి అయితే ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు రా అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివైతే.. నీకు దమ్ముంటే బీఆర్ఎస్ నుండి తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు రా అని ఛాలెంజ్ చేశారు. ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హస్తం గుర్తుపై గెలిచిన రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టండంటూ గతంలో రేవంత్ కామెంట్స్ వీడియోను సభలో ప్రదర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ను వెంటబడి మరీ ఓడిద్దామని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి పోవడంతో జగిత్యాలకు పట్టిన శని వదిలిపోయిందన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే.. సంజయ్ రేవంత్రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడి కాంగ్రెస్ పార్టీలోకి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రేవంత్ రెడ్డే కాదు.. అందరూ మాట్లాడారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా చాలా మాట్లాడారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్ క్వాలిఫికేషన్ చేస్తా అని రాహుల్ తుక్కుగూడలో నరికిండు. మేనిఫెస్టోలో పెట్టుడు కాకుండా పాంచ్ న్యాయ్ అనే దాంట్లో కూడా పెట్టారు రాహుల్ గాంధీ. ఇక జీవన్ రెడ్డి కూడా ఆగమైండు.. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారొద్దని మేం మేనిఫెస్టోలో పెట్టామని జీవన్ రెడ్డి చెప్పిండు. ఇక ఇప్పుడు జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఓట్లకు వస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలి అని కేటీఆర్ చెప్పారు.
2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ నుంచి 26 మంది గెలిస్తే.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే ప్రయత్నం చేశారు. 2014లో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. 2014 తర్వాత రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి ఓటుకు నోటుకేసులో జైలుకు పోయిండు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది మన పార్టీలో విలీనం అయ్యారు రాజ్యాంగబద్ధంగా. మనం రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కలేదు. 2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు కలిసి బీఆర్ఎస్లో విలీనం అయ్యారని కేటీఆర్ తెలిపారు