కోల్కతాలో హత్యాచార ఘటన.. కేంద్ర కీలక నిర్ణయం
కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో నిరసనలు వ్యక్తమౌతున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో నిరసనలు వ్యక్తమౌతున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. అన్నీకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యల జాబితాను విడుదల చేసింది. ఆస్పత్రుల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నది. రాత్రి సమయంలో విధుల్లో ఉండే మహిళా వైద్యులకు ఎస్కార్ట్ అందించాలని సూచించింది. మహిళా ఆరోగ్య నిపుణుల కోసం ప్రత్యేక రిటైరింగ్ గదులు, సీసీటీవీలు ఉండే సేఫ్జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల అధిపతులకు తెలియజేసింది. రాత్రిపూట మహిళా వైద్యులు విధుల్లో ఉండాల్సి వస్తే ఒకరికంటే ఎక్కువమంది ఉండేలా చూడాలని పేర్కొన్నది. ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను అరికట్డడానికి ప్రత్యేక కేంద్ర చట్టాన్ని వైద్యులు డిమాండ్ చేస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
నేడు సుప్రీంకోర్టులో విచారణ
మరోవైపు జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ట్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం నేడు ఈ కేసును విచారించనున్నది.
అతనికి ఉరిశిక్ష విధించినా ఫర్వాలేదు: నిందితుడి అత్త
కోల్కతా హత్యాచార నిందితుడైన సంజయ్ రాయ్ జీవితంలోని మరో కోణంలో వెలుగులోకి వచ్చింది. భార్యతో అతనికి గొడవలు జరిగేవని, వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని ఈ మేరకు నిందితుడి అత్త దుర్గాదేవి మీడియాకు సంచలన విషయాలు వెల్లడించింది. అతను మంచి వాడు కాదని మూడు నెలల గర్భంతో ఉన్నప్పుడు అతను తన కూతురుపై చేయి చేసుకోవడంతో గర్భస్రావమైంది. కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. నేరం అతనొక్కడి వల్లకాదని మరికొంతమంది ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అతనికి ఉరిశిక్ష విధించినా ఫర్వాలేదని వ్యాఖ్యానించారు.
ఆర్జీకర్ ఆస్పత్రి ఆర్థిక అవకతవకలపై సిట్ ఏర్పాటు
వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రి ఆర్థిక అవకతవకలపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధిపతిగా ఐజీ ప్రణవ్ కుమార్ను నియమించింది. 2021 నుంచి జరిగిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని మమతా ప్రభుత్వం ఆదేశించింది. ఒక నెలలోగా మొదటి నివేదిక సమర్పించాలని కోరింది.
బాధితురాలి తండ్రి ఆరోపణల్లో వాస్తవం లేదు
తన కూతురు శవాన్ని హడావుడిగా దహనం చేశారని కోల్కతా ఆర్జీకర్ హత్యాచార బాధితురాలి తండ్రి ఆరోపించారు. రెండు మృతదేహాలు ఉన్నా ముందుగానే ఆమె శవాన్ని దహనం చేశారని ఆరోపించారు. దీనిపై కోల్కతా శ్మశాన వాటిక మేనేజర్ వివరణ ఇచ్చారు. పోస్టు మార్టం జరిగిన తర్వాత ఆరు గంటల వ్యవధి ఉన్నది. ఆ మధ్య కాలంలో శవం కుళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పోలీసులు వేగవంతంగా అంత్యక్రియలు పూర్తి చేయమని చెప్పినట్లు వివరించారు.