తెలంగాణలో వరదలపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఆగ్రహం

ప్రజల ప్రాణాలు కాపాడటంలో, వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

By :  Vamshi
Update: 2024-09-02 14:16 GMT

తెలంగాణ లో వరదల బారి నుంచి ప్రజలను కాపాడి వారికి భరోసా కల్పించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ లో ఏర్పడిన పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేశాయని...ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు సమాధానంగా కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కేవలం బాధపడతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తే సరిపోదని రాహుల్ గాంధీకి సూచించారు. తెలంగాణలో నిజంగా ప్రభుత్వం తరఫున చేయాల్సిన సహాయక కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేస్తున్నారో లేదో తెలుసుకుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం నిర్వాకం తెలిసి వస్తుందని రాహుల్‌కి చురకంటించారు.

మీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ఛిన్నాభిన్నామైందని కేటీఆర్ అన్నారు. నిజంగా మీకు తెలంగాణపై శ్రద్ధ ఉండి ఉంటే రేవంత్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యపు, తప్పుడు చర్యలను మీరెందుకు తప్పుబట్టలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో రోజురోజుకు మీ పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతోందని రాహుల్ గాంధీకి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ వరదల్లో ప్రాణ నష్టం, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చేతగాని మీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను దేవుడే కాపాడాలంటూ ప్రభుత్వ పెద్దలే మాట్లాడుతుంటే...ఇంకా మీ ప్రభుత్వం ఉండి ప్రయోజనం ఏమిటనీ రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు.

Tags:    

Similar News