ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నదా?: వైఎస్ జగన్
ఏపీలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు దాడులకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు.
ఏపీలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు దాడులకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. శిబిరం వద్ద ఏపీలో వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులను, ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శించారు. బుక్లెట్ పంపిణీ చేశారు.
ధర్నా చేపట్టడానికి ముందు జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 51 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. వైసీపీ పార్టీ కార్యకర్తల వందల ఇండ్లను ధ్వంసం చేశారని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, వెయ్యికి పైగా అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
గిట్టని వారి పంటలను నాశనం చేశారు. మా హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులను, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. లోకేశ్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు పెట్టారని, తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ సంస్కృతి వచ్చింది: అఖిలేశ్
జగన్ ధర్నాకు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్, శివసేన (ఉద్దవ్) ఎంపీ సంజయ్ రౌత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాని చెప్పారు. ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు శాంతియుతంగా ఉండాలని సూచించారు. విపక్షాలపై హింసకు దిగవద్దన్నారు. కఠిన పరిస్థితుల్లో జగన్ కార్యకర్తల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ సంస్కృతి వచ్చిందన్నారు. బుల్డోబర్ సంస్కృతికి తాము వ్యతిరేకం అన్నారు. యూపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొన్నదని, ఇలాంటి హింస్మాతక ఘటనలో ఎన్నో జరిగాయన్నాయని, యూపీ సర్కార్తో తాము పోరాడుతున్నట్లు చెప్పారు.