24 నుంచి అందుబాటులో గ్రూప్-1 ఓఎంఆర్ షీట్స్
ఈ నెల 9వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఎంఆర్ షీట్స్ ఈ నె 24న సాయంత్రం 5 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ ఈ నె 24న సాయంత్రం 5 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లో వివరాలు నమోదు చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
రాష్ట్రంలో 563 పోస్టులతో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్కు 4,93,667 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 9న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 3,02,172 (74 శాతం) హాజరయ్యారని నవీన్ నికోలస్ ప్రకటించారు. వనపర్తిలో అత్యధికంగా 82.74, హైదరాబాద్లో అత్యల్పంగా 61.78 శాతం నమోదైందని చెప్పారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రైమరీ కీని టీజీపీఎస్సీ ఈ నెల 13న విడుదల చేసింది. జూన్ 17లోగా అభ్యంతరాలను తెలుపాల్సిందిగా కోరింది. అలాగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించున్నది. తాజాగా ఓఎంఆర్ షీట్ను ఈనెల 24 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నదని ప్రకటించడంతో ప్రైమరీ కీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది కీతో పాటు మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నది.
మరోవైపు మెయిన్స్ 1:50 పద్ధతిలో 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలని నిరుద్యోగులతో పాటు విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇదే విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో మొన్న ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెయిన్స్కు ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదనేది ఆసక్తికరంగా మారింది.