స్కూళ్లు, విద్యాసంస్థలకు ఫ్రీ కరెంట్.. ఉత్తర్వులు జారీ
27,862 విద్యాసంస్థలకు లబ్ధి
రాష్ట్రంలోని స్కూళ్లు, విద్యా సంస్థలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 27,862 స్కూళ్లు, విద్యాసంస్థలకు లబ్ధి కలుగనుంది. స్కూళ్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు ఉచిత కరెంట్ సరఫరా చేసేందుకు తెలంగాణ డిస్కమ్స్ ప్రత్యేకంగా ఆన్ లైన్ పోర్టల్ రూపొందిస్తాయి. ఆయా విద్యాసంస్థల ఉన్నతాధికారులకు లాగిన్స్ ఇచ్చి తమ పరిధిలో ఏయే విద్యాసంస్థలకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయాలనే నమోదు చేయిస్తుంది. ఆయా విద్యాసంస్థల సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు ఫైనల్ చేసిన విద్యాసంస్థల్లో ప్రతి నెల ఎన్ని యూనిట్ల కరెంట్ వినియోగించారు.. అందుకు ఎంత బిల్లు అవుతుందనే వివరాలు తీస్తారు. ఆ బిల్లు హార్డ్ కాపీని సంబంధిత విద్యాసంస్థ హెడ్ కు అందజేయడంతో ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేస్తారు. విద్యాసంస్థ, మండలం, జిల్లా స్థాయిలో కరెంట్ వినియోగం, అందుకు ఎంత మొత్తం ఖర్చవుతుంది, అత్యధిక వినియోగం, అతి తక్కువ వినియోగం, వాటి చెల్లింపులు, ఇతర వివరాలన్నీ మెయింటేన్ చేస్తారు. ఆయా విద్యాసంస్థలు వినియోగించుకున్న కరెంట్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఇందుకోసం పోర్టల్ ను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో అనుసంధానిస్తారు. ప్రభుత్వం స్కూళ్ల మెయింటనెన్స్ కు నిధులు ఇవ్వకపోవడంతో కరెంట్ బిల్లులు ఆయా విద్యాసంస్థల భారంగా మారింది. బిల్లులు పేరుకుపోయిన స్కూళ్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకు విద్యుత్ అధికారులు కరెంట్ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే స్కూళ్లు, విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ హామీని నిలబెట్టుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.