నటి అనన్యను అభినందించిన పవన్...మరి హీరోయిన్ల సాయమేది?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తనవంతుగా రూ.5 లక్షలు సాయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అనన్యను అభినందించారు.
తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తనవంతుగా రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు ఇస్తున్నట్టు అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అనన్యను అభినందించారు. తన అభిమాన హీరో పవన్ తనకు స్పూర్తి అని ఆయనకు ధన్యవాదలు తెలిపారు అనన్య. ఈ నేపథ్యంలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె ప్రకటించింది చిన్నమొత్తమే కావొచ్చు కానీ, ఆమెది పెద్ద మనసు అంటూ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.
సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్లలో విరాళం ఇచ్చింది అనన్య ఒక్కతేనని చెప్పుకోవాలి. ఇప్పటి వరకూ భారీ పారితోషికాలు తీసుకునే హీరోయిన్లు ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు ఇలాంటి విపత్కర సమయంలో సాయం అందించడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా టాలీవుడ్ హీరోయిన్లు మేల్కొని తమ వంతు సాయాన్ని వరద బాధితులకు ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ, తెలంగాణకు చెరొక కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి చెరొక రూ.50 లక్షలు, ఐకాన్ స్టాన్ అల్లు అర్జున్ చెరొక రూ.50 లక్షలను అనౌన్స్ చేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వంతు బాధ్యతగా ఏపీకి కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయలను ప్రకటించారు. అలాగే ఏపీలోని వరద ప్రభావిత నియోజకవర్గాలకు నాలుగు కోట్ల రూపాయలను ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు స్టేట్స్కు చెరొక రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. ఇంత మంది హీరోలు తమ వంతుగా సాయం అందిస్తున్నా హీరోయిన్లలో మాత్రం చలనం లేదు. అనన్యను చూసి మిగతా హీరోయిన్లు నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.