రాష్ట్రంలో షరతుల పాలన: హరీశ్‌రావు

రుణాలు తెచ్చుకోమని ఆరోజు అందరిని ఉరుకుమన్నవ్, ఈ రోజు కొందరిని ఆగవడుతున్నవ్. ఇది ఎక్కడి పద్ధతి అని సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

By :  Raju
Update: 2024-07-16 10:16 GMT

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది. కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారం లోకి వచ్చాక మాట తప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

రుణమాఫీ మార్గదర్శకాలపై ఆయన అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కుటుంబానికి ఒక్కరికే అని, రేషన్ కార్డు ఉన్న వాళ్లకే అని చెబితే అయిపోవు కదా. ఆరోజు అందరిని ఉరుకుమన్నవ్, ఈ రోజు కొందరిని ఆగవడుతున్నవ్. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నా. బ్యాంకులు పాస్ బుక్కులు చూసి రుణం ఇచ్చాయి. అంతేగాని రేషన్ కార్డులు చూసి ఇవ్వలేదన్నారు. బ్యాంకులకు లేని షరతు, ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ గైడ్ లైన్స్ గోల్డ్ ఇచ్చే వాటి కంటే దారుణంగా ఉన్నాయన్నారు. రైతా కాదా చూడండని మాజీ మంత్రి సూచించారు. చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం వచ్చాక పంటలు సరిగ్గా పండలేదు. రైతులు నష్టపోయారు. షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంసారం వేరు పడ్డది కానీ, రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. రేషన్ కార్డు విడిపోనంత మాత్రాన అర్హులు కాకుండా పోతారా అని నిలదీశారు. రేషన్ కార్డు ఒకటే అని తండ్రికి చేస్తాం, కొడుకుకు చేయం అంటే కొట్లాటలు పెట్టినట్లు కాదా అని ప్రశ్నించారు. ఆధార్, రేషన్ లింకులు పెట్టడం అనేది రైతులను మోసం చేయడం దగా చేయడమే అని ధ్వజమెత్తారు.

మేం రైతులను రైతులుగా చూశాం

పాస్ బుక్కు, రేషన్, ఆధార్ డేటా ఒకటిగా ఉంటేనే రుణమాఫీ ఇస్తా అంటున్నారు.లేకుంటే ఇవ్వరా? ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఏడు నెలల నుంచి ఇవ్వలేదు. కార్డు లేదని రుణమాఫీ చేయకపోవడం దగా చేయడం కాదా? ఆధార్ కార్డు లేదని రైతు రుణమాఫీ చేయం అంటే తగునా? అని హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి వడపోతల మీద, కోతల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇలాంటి షరతులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రేషన్ కార్డు షరతు తొలగించి, రుణాలు తెచ్చుకున్న అందరు రైతులకు రుణ మాఫీ చేయాలన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన నాడు ఇలాంటివి మేం పెట్టలేదని రైతులను రైతులుగా చూసి లక్ష రూపాయల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు.

మెజార్టీ రైతులను రుణమాఫీకి దూరం చేసేందుకు కుట్ర

పీఎం కిసాన్ డేటాను పరిగణనలోకి తీసుకుంటాం అంటున్నారు. అంటే సగానికి సగం రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ఇది అన్నారు. రైతు బంధు కింద 68,99,79 మంది రైతులు లబ్ధి పొందితే, 30లక్షల 36వేల మందికి పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందారు.పీఎం కిసాన్ పరిగణనలోకి తీసుకోవడమంటే 39లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే అన్నారు.రైతు బంధు కింద ఏడాదికి 15,248 కోట్లు ఇస్తే, పీఎం కిసాన్ కింద ఇచ్చేది 1821 కోట్లే అని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు చూస్తేమెజార్టీ రైతులను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నదని స్పష్టమౌతున్నదన్నారు. అటు పీఎం ఇయ్యడు ఇటు సీఎం ఇయ్యడు.బడేబాయ్ బాటలో చోటే బాయ్ నడుస్తున్నడని విమర్శించారు. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 60శాతం మంది రైతులను దూరం చేయడమే.ఈరోజు పిల్లలు వాహనం, చదువులు, ఇల్లు కోసం రైతు ఐటీ ఫైల్ చేస్తున్నడు. ఇలాంటి వారు పీఎం కిసాన్ కు అనర్హులు.ఆర్టీసీ, సింగరేణి, నాలుగోతరగతి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పించనర్లు వీరికి కూడా పీఎం కిసాన్ కు అనర్హులు. అంటే వీరందరు రుణమాఫీకి అనర్హులు అన్నట్టా అని ప్రశ్నించారు.

అప్పు కట్టేందుకు అప్పు తెచ్చుకోవాలా?

రెండు లక్షలకు పైగా అప్పున్న రైతులు, ఆ అప్పును కడితేనే రుణమాఫీ చేస్తం అంటున్నారు. అంటే అప్పు మాఫీ కోసం బయట మూడు రూపాయలకు మళ్లా అప్పు తెచ్చుకునే పరిస్థితి నెలకొన్నది. అప్పు కట్టేందుకు అప్పు తెచ్చుకో అన్నట్లు ప్రభుత్వ వైఖరి ఉన్నది. రైతుకు అప్ప ఎప్పుడు పుట్టాలి? ఎప్పుడు కట్టాలి? ఎప్పుడు మీరు ఆయన ఖాతాలో వెయ్యాలి? ఇదంతా జరిగే సరికి ఎంత ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి షరతులు పెట్టకుండా.. మీరు ఇచ్చే రెండు లక్షల రుణమాఫీ చేయాలన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీళ్లు లేక గత సీజన్ లో పంటలు పండలేదు. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు. పైగా అప్పు కట్టు అనడం తీవ్రమైన అన్యాయం చేయడం. ఆలస్యం చేయడం అన్నారు.

దాదాపు పది లక్షల ఎకరాలకు రుణమాఫీ లేనట్టే!

ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందనడం దారుణం. అంటే దీర్ఘకాలిక పంటలకు లేదన్నట్లే అని తెలిపారు.బత్తాయి తోట, మామిడి తోట, ఫాం ఆయిల్ ఇలాంటి పంటలకు రుణమాఫీ లేదు. దీన్నిబట్టి దాదాపు పది లక్షల ఎకరాలకు రుణమాఫీ లేనట్టే. అలాగే రీషెడ్యుల్ చేసుకున్న వారికి రుణాలు వర్తించవు అన్నారు. తీవ్రంగా రైతులు నష్టపోయినప్పుడు, కరువు పరిస్థితులు ఉన్నపుడు, వరదలు వచ్చి పంట పొలాలు కొట్టుకుపోయినప్పుడు రీషెడ్యుల్ చేస్తారు. నిజానికి వారే ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవారు. వారికి రుణమాఫీ లేదని చెప్పడం దుర్మార్గం అన్నారు. రీషెడ్యుల్ చేయమని రైతులు అడగరు. ప్రభుత్వం చేసిన పనికి రైతులకు ఎందుకు శిక్ష అని ప్రశ్నించారు.

రుణమాఫీ అమలుకు ఎండింగ్ డేటే ఉంటది

సకాలంలో తీసుకున్న అప్పులు కట్టిన వారికి మొండి చేయి చూపడం సరికాదన్నారు. దీన్ని కూడా ఆలోచించాలి. రైతును సానుభూతితో చూడాలి. రుణమాఫీ వారికి కూడా చేయాలని కోరుతున్నామన్నారు. జేఎల్జీ, ఎస్ హెచ్ జీ, ఫార్మర్ ప్రొడ్యుసర్ ఆర్గనైజేషన్ వారికి రుణ మాఫీ చేయం అన్నారు. ఈ గ్రూపుల్లో చిన్న రైతులు ఉంటారు. గ్రూపుగా ఏర్పడి పంటలు పండిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఎంకరేజ్ చేశాయి. మీరే ప్రోత్సహిస్తారు, ఇప్పుడు మీరే రుణమాఫీ చేయరా. మీ మాట విన్నందుకు మీరు వేసే శిక్షణా ఇది. దళిత, గిరిజన, పేద వర్గాలకు రుణమాఫీ చేయకపోవడం సరికాదు. రుణమాఫీ అమలుకు స్టార్టింగ్ డేట్ ఉండదు, ఎండింగ్ డేట్ ఉంటుంది. మేము అలాగే చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటున్నారు. ఇలా కొందరు రైతులకు కోత పెట్టినట్లే కదా. ఇది తీవ్రమైన అన్యాయమని హరీశ్‌ అన్నారు.

మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రుణమాఫీ చేయాలి

అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు మాఫీ చేస్తం అన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తం అన్నారు. కానీ, 8 నెలల కాలానికి వడ్డీ ఎవరు భరించాలి? మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రుణమాఫీ చేయాలి. అమలు చేసే దాకా అయ్యే వడ్డీని కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల బాధ్యతలు అని రైతులను అవమానించారు. రైతులను బెదిరించే ప్రయత్నం చేశారు. రైతుకు ఆత్మగౌరవం విలువ ఎక్కువ. రైతుకు గౌరవంగా ఇవ్వాలి అవమాన పేర్చాలి. ఇలాంటి పదాలు వాడటం పట్ల అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం.

రెండు లక్షల మాఫీ అంటూనే షరతులు వర్తిస్తాయంటున్నారు

గతంలో సీఎం మాట్లాడుతూ రేషన్ కార్డు ప్రామాణికం కాదు అన్నారు. నాలుగు రోజుల తర్వాత రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు.ఎన్నికల ముందు వడ్లకు బోనస్ ఇస్తాం అన్నారు. ఎన్నికల తర్వాత సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.పది శాతం సన్నాలకు ఇచ్చి, 90శాతం రైతులకు పంగనామాలు పెడుతున్నరు. ఇట్లా ఈ ప్రభుత్వం లక్షల మంది రైతులను దగా చేస్తున్నది. రెండు లక్షల మాఫీ అని షరతులు వర్తిస్తాయని ఆరు పేజీల నిబంధనను ముందు పెడుతున్నరు.వ్యాపారంలో చేసినట్లు రైతుల పట్ల వ్యవహరిస్తున్నది. మేంమొదటి విడుత 35లక్షల 31వేల మంది రైతులకు 16,144 కోట్ల రుణమాఫీ చేశాం.రెండో విడుత 22లక్షల 98 వేల మంది రైతులకు 13వేల కోట్లు మాఫీ చేశాం.రెండు విడతలు కలిపి 29,144 కోట్లు రుణమాఫీ చేశాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇన్ని నిబంధనలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. రుణమాఫీ నిబంధనలు సవరించాలి. రద్దు చేయాలన్నారు. రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణం చేయాలి. అమలుపరిచే వరకు వడ్డీ కూడా చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 హామీలు సహా రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తే రాజీనామా చేస్తా అన్నాను దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.

ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం

అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేస్తే, నాకు సంతోషం. నాలుగు వేల పింఛన్ కాదు, రెండు నెలల నుంచి అవ్వాతాతలకు పింఛన్ రాలేదు. కొండనాలుక మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు ఉన్నది. మొదటి హామీ 7500 రైతు భరోసా అన్నారు. నాలుగు వేల పింఛన్ అన్నారు. 2500 మహిళలకు ఇస్త అన్నరు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు అన్నరు. విద్యార్థి భరోసా కార్డు ఇస్తామన్నరు . ఇవేవి రాలేదన్నారు. పదవులో ఉన్నమని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడితే లాభం లేదు.ఇచ్చిన గ్యాస్ కరెంట్ కూడా సగం సగమే. ప్రభుత్వం ఎంత మందికి ఉచిత గ్యాస్ ఇచ్చింది? ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రుణమాఫీ షరతులను విరమించుకోవాలి

పత్రికలు చూస్తే బాధ అనిపిస్తున్నది. రైతు ఆత్మహత్య లేని రోజు లేదు. దాదాపు 400 పై చిలుకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు.ఆ వివరాలు పంపితే రైతులకు పరిహారం ఇస్తామని సీఎం అన్నరు. గతంలోనే వివరాలు సీఎంకు పంపితే ఎలాంటి స్పందన లేదన్నారు.ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడంలో విఫలమవుతున్నది. ప్రభుత్వం రుణమాఫీ షరతులను విరమించుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజాపోరాటానికి శ్రీకారం చుడుతాం, అసెంబ్లీని స్తంభింపజేస్తామన్నారు. 

Tags:    

Similar News