హాస్టల్ పిల్లలకు క్యాన్సర్ కారక ఆహార పదార్థాలా?
వాటి సరఫరా టెండర్లను ప్రభుత్వం రద్దు చేయాలే.. సోషల్ మీడియాలో డిమాండ్లు
హాస్టల్ విద్యార్థులకు క్యాన్సర్ కారక ఆహార పదార్థాలా? ప్రభుత్వం వెంటనే వాటి సరఫరా కోసం ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు 'ది హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) లిమిటెడ్ ఈనెల 23న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తంగా 79 రకాల పదార్థాల సరఫరాకు హాకా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అనుభవం, అర్హత ఉన్న సంస్థలు ఆయా పదార్థాలు నేరుగా నల్గొండ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడ్రన్ స్కూళ్లకు సరఫరా చేయాలని నోటిఫికేషన్ లో వెల్లడించింది. టెండర్లు దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఇచ్చింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రైస్ బిడ్లు ఓపెన్ చేసి అందరికన్నా తక్కువ కోట్ చేసిన ఏజెన్సీలకు ఆయా పదార్థాల సరఫరా టెండర్లను అప్పగించనున్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా విద్యార్థులకు ఫలానా కంపెనీల ఆహార పదార్థాలనే సరఫరా చేయాలని టెండర్ నిబంధనల్లో చేర్చారు. అందులో నిషేధిత సంస్థలు కూడా ఉన్నాయని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు దేశాలు ఆయా ఆహార పదార్థాలను బ్యాన్ చేసిన తర్వాత మన దేశంలోనూ వాటి ఆహార నాణ్యతను పరిశీలిస్తే వాటిలో క్యాన్సర్ కారక పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నట్టుగా తేలిందని.. టెండర్లను నిలిపివేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలే సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
''జాగో తెలంగాణ✊ .. సీఎం రేవంత్ అన్నా.. ఇది న్యాయమా?.. ఇప్పటికే ఉన్న ఫ్లోరోసిస్ బాధకు అదనంగా నల్లగొండ జిల్లాలోని బడుగు వర్గాల బిడ్డలపై క్యాన్సర్ కారక ఆహార పదార్థాల ప్రయోగం !.. ఆ దిక్కు అసెంబ్లీ.. ఈ దిక్కు హాకా ఆఫీస్.. ఈ టెండర్ ఎవరికోసం ?.. టెండర్ నిబంధనలలోనే నిలువెత్తు నిర్లక్ష్యం.. నేడు ఖరారు కానున్న.. ఈ టెండర్ ఆంతర్యం ఏదైనా... ఇలాంటివి ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా బిడ్డలు చూస్తూ సహించబోరు..'' అని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సోషల్ మీడియాలో 'రాయిటర్స్', 'బిజినెస్ స్టాండర్డ్' కథనాలు జోడించి పోస్టులు పెడుతున్నారు. భారత్ కు చెందిన ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ స్పైసెస్ ను హాంగ్ కాంగ్ సహా పలు దేశాలు ఇటీవల బ్యాన్ చేశారు. ఆయా సంస్థలు ఉత్పత్తి చేస్తున్న పదార్థాలకు క్వాలిటీ కంట్రోల్ టెస్టులు నిర్వహించగా వాటిలో క్యాన్సర్ కారక పెస్టిసైడ్స్ వాడినట్టుగా నిర్దారణ అయ్యిందని రాయిటర్స్ తమ కథనంలో వెల్లడించింది. ఆయా ఆహార పదార్థాల్లో ఇథలిన్ ఆక్సైడ్ ఆనే హానికార పెస్టిసైడ్ గుర్తించామని, అది దీర్ఘకాలంలో మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. వాళ్లు క్యాన్సర్ బారిన పడటానికి కారణమవుతుందని ఆ కథనంలో వెల్లడించింది. ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ స్పైసెస్ భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు, అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, యూకే దేశాలకు తమ పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ బ్రాండ్ల స్పైసెస్ పై హాంకాంగ్ నిషేధం విధించింది. ఎవరెస్ట్ కర్రీ మసాలాను రీ కాల్ చేయాలని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఏప్రిల్ 18న ఆదేశాలు ఇచ్చింది. 2023లోనే ఎవరెస్ట్ కు చెందిన రెండు స్పైసెస్ ను అమెరికా రీకాల్ చేసింది. ఈనేపథ్యంలో సీఎఫ్ఎస్ ఎండీహెచ్కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్, ఎవరెస్ట్ కు చెందిన ఫిష్ మసాలాలను పరీక్షించి వాటిలో క్యాన్సర్ కారక పెస్టిసైడ్స్ ఉపయోగించినట్టుగా గుర్తించింది. ఈ విషయాన్ని సీఎఫ్ఎస్ కు చెందిన సీనియర్ అధికారే నిర్దారించారని రాయిటర్స్ వెల్లడించింది.
హాకా జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ లో గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, బోజ్వర్ మసాలాల్లో ఎవరెస్ట్ బ్రాండ్ కూడా సరఫరా చేయవచ్చని నిర్దేశించారని, వెంటనే ఆ బ్రాండ్ ను జాబితా నుంచి తొలగించాలని నల్గొండ జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. టెండర్ నోటిఫికేషన్ లో మరో రెండు సంస్థల బ్రాండ్ల పేర్లు ఉన్నా.. ఎవరెస్ట్ మసాలాలు సరఫరా చేసేలా ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఒక ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానిస్తున్నారు. టెండర్ తో సంబంధం లేకుండా ఆ ఏజెన్సీకే మసాలాలు సరఫరా చేసే పనులు అప్పగించేలా తెరచాటు వ్యవహారాలు సాగాయని.. ఇందులో ప్రభుత్వంలోని ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే దానికి ఎదురుగా ఉన్న హాకా బిల్డింగ్ నుంచి నిషేధిత ఆహార పదార్థాలు, క్యాన్సర్ కారక ఆహార పదార్ధాల సరఫరాకు టెండర్ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఈ టెండర్లు రద్దు చేయించాలని కోరుతున్నారు. నిషేధిత ఆహార పదార్థాలను ఈ జాబితాలో చేర్చడానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.