కవితకు బెయిల్.. బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సత్యమే గెలిచిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సత్యమే గెలిచిందంటూ ట్వీట్స్ చేస్తున్నాయి. 20 నెలల పాటు విచారణ చేసినా,153 రోజులు జైలులో ఉంచి 499 మంది సాక్షులను విచారించిన నేరం రుజువు కాలేదంటున్నాయి. సింగం ఈజ్ బ్యాక్ అంటూ బీఆర్ఎస్ అభిమానులు స్పెషల్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. కాగా, దాదాపు ఐదు నెలలుగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉంటున్న కవిత.. 11 కేజీల బరువు తగ్గారు. 153 రోజులు జైలులో ఉన్న ఆమె పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. మార్చిలో జైలుకు వెళ్లిన కవిత జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు.
అప్పుడు కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. మనీల్యాండరింగ్ చట్టం(పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 45 ప్రకారం .. బెయిల్కు కవిత అర్హురాలు అని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును ఇచ్చింది. లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిసిందని, కానీ విచారణ ముగిసేందుకు చాలా సమయం పడుతుందని ధర్మాసనం పేర్కొన్నది