స్టేజీపైనే తమిళసైకి వార్నింగ్ ఇచ్చిన అమిత్షా
తమిళసైని మందలించిన వీడియో వైరల్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై మధ్య జరిగిన సంభాషణ వీడియో తెగ వైరలవుతోంది. స్టేజీపైకి వచ్చిన ఆమెను దగ్గరకు పిలిచి అమిత్షా మందలించినట్లు తెలుస్తోంది. ఆమె సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా షా వినకుండా వార్నింగ్ ఇచ్చినట్లు వీడియోలో కనిపించింది. తాజగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పై తమిళసై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే ఇరువురి మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం బురద జల్లుకుంటున్నారు.
తమిళిసై సౌందర్రాజన్ ఇటీవల మాట్లాడుతూ, బీజేపీలోకి ‘సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చార’న్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుచ్చి సూరియ శివ మండిపడ్డారు. తమిళిసై సిఫారసు మేరకు నియమితుడైన ఎల్ మురుగన్ పదవీ కాలంలోనే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారిని పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. అలాంటివారి పేర్లతో ఓ జాబితాను తాను ఇవ్వగలనని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఓటమికి అన్నామలై కారణమని కొందరు ఆరోపించగా, ఆయన మద్దతుదారులు స్పందిస్తూ, రాష్ట్రంలో పార్టీ ఓటు షేర్ పెరిగిందని సమర్థిస్తున్నారు. తమిళిసై పార్టీ వ్యవహారాలను బహిరంగంగా చర్చిస్తున్నారని మండిపడుతున్నారు.