ఉగ్రవాదుల ఏరివేతకు 500 మంది స్పెషల్ ఫోర్స్ కమెండోలు
జమ్ములో ఉగ్రవాదులఆట కట్టించేందుకు 500 మంది స్పెషల్ ఫోర్స్ కమెండోలను రంగంలోకి దించినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
జమ్ములో ఇటీవల వరుస దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 4000 మంది భద్రతా దళాలు గాలింపు చర్యల్లో పాల్గొంటుండగా..తాజాగా అదనపు బలగాలను మోహరించారు. హెలీకాప్టర్లు, డ్రోన్లతో ముష్కరులను జల్లెడ పడుతున్నారు.
జమ్ములో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో భారత్లోకి అక్రమంగా చొరబడిన 50 -55 మంది ఉగ్రవాదులను ఏరివేత కోసం వేట కొనసాగుతున్నది. వారి ఆట కట్టించేందుకు 500 మంది స్పెషల్ ఫోర్స్ కమెండోలను రంగంలోకి దించినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. నిఘా వర్షాలు కూడా తమ చర్యలను వేగవంతం చేసినట్లు పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు అండదండలు అందించేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల జమ్ము,రాజౌరీ, పూంచ్, రియాసీ, కఠువా జిల్లాలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతుండటంతో భద్రతా దళాలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. జమ్ముల్లో ఇటీవల జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు పన్నిన గెరిల్లా దాడులు, వారువాడిన అత్యాధునిక ఆయుధాల ప్రకారం వారు సాధారణ ఉగ్రవాదులు కాదని తెలుస్తోంది. వారిలో కొంతమంది పాకిస్థాన్కు చెందిన మాజీ సైనికులు ఉండొచ్చని ఇంటలీజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జమ్ము కశ్మీర్లో గత 32 నెలల్లో జరిగిన దాడుల్లో సుమారు 50 మంది భద్రతా సిబ్బంది సహా సామాన్య పౌరులు మరణించారు. నాలుగు నెలల్లో నాలుగు భారీ ఉగ్రదాడులు జరిగాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ఆర్మీ కెప్టెన్ సహా 12 మంది సైనికులు అమరులయ్యారు. మరో 10 మంది సామాన్యులు చనిపోగా..మరికొంతమంది గాయపడ్డారు.