రేవంత్కు దమ్ముంటే… చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలి.. కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్కు దమ్ముంటే.. చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
రుణమాఫీ కాక లక్షలాది మంది రైతులు బాధపడుతుంటే వారిని పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ యాత్రలా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్కు దమ్ముంటే.. చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో.. ఏకంగా 20 సార్లు హస్తిన చుట్టూ చక్కర్లు కొడతారా..? రిమోట్ కంట్రోల్ పాలనతో అన్నదాతను బలి చేస్తారా..? అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జూటా మాటలు చెప్పి అధికారంలోకి రాగనే విమానంలో ఊరేగుతున్నారు మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..? అని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతలను ఆగంచేసి. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే..రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు..?? అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..?? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. “గుండుసున్నా”.
ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం అని కేటీఆర్ హెచ్చరించారు.