ఇక లోన్లు తీసుకోవడం ఈజీ
యూపీఐ తరహాలో కొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్ తేనున్న ఆర్బీఐ
లోన్లు తీసుకునేందుకు తంటాలు పడుతున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రుణాలు తీసుకోవడం చాలా ఈజీ అని చెప్పేసింది. ఇందుకోసం ఒక డిజిటల్ ప్లాట్ ఫాం తీసుకురాబోతుంది. యూపీఐ సర్వీసుల ద్వారా డిజిటల్ పేమెంట్లను సులభతరం చేసినట్టుగానే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేస్ (యూఎల్ఐ) సర్వీస్ ను తీసుకురాబోతుంది. ఈ యూఎల్ఐ సేవలు త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. నిరుడు ఆర్బీఐ ప్రవేశపెట్టిన 'ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్' పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో ఆ సేవలను మరింత విస్తృతం చేసి యూఎల్ఐ సర్వీసులు తీసుకురాబోతుంది. బెంగళూరులో నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్ లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. దేశ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లో యూఎల్ఐ కీలక పాత్ర పోషించబోతుందని తెలిపారు. భూములు, ఆస్తులు, ఇతర డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యూఎల్ఐ పని చేస్తుందని తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత లోన్లు పొందేందుకు డాక్యుమెంటేషన్ అవసరం ఉండదని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయ రుణాల జారీ వేగవంతమవుతుందని వెల్లడించారు. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలోనే యూఎల్ఐని తీసుకురబోతున్నామని తెలిపారు.