టాలీవుడ్లో ఆ నివేదిక విడుదల చేయండి: సమంత
టాలీవుడ్లోనూ మహిళల కోసం 2019లో వాయిస్ ఆఫ్ విమెన్ గ్రూప్ ఏర్పాటు చేశారని, దాని ద్వారా రూపొందించిన నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి
జస్టిస్ హేమ కమిటీతో కేరళలోని చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కమిటీని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్వాగతించారు.టాలీవుడ్లోనూ మహిళల కోసం 2019లో వాయిస్ ఆఫ్ విమెన్ గ్రూప్ ఏర్పాటు చేశారని, దాని ద్వారా రూపొందించిన నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి చేశారు.
హేమ కమిటీ నివేదికపై సమంత మొదటిసారి స్పందించారు. కమిటీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లనే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని పేర్కొన్నది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి డబ్ల్యూసీసీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. పని ప్రదేశాల్లో భద్రత అనేది మహిళల కనీస అవసరమని చెప్పారు.
ఓ మలయాళ నటిపై లైంగిక వేధింపులు జరిగిన నేపథ్యంలో వారికి అండగా నిలువడానికి 'విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్' (డబ్ల్యూసీసీ) 2017లో ఏర్పాటైంది. ఈ డబ్ల్యూసీసీ విజ్ఞప్తి మేరకు కేరళ ప్రభుత్వం జస్టిస్ కమిటీని 2019లో నియమించింది. మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ రిపోర్ట్లో విస్తుపోయే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగానే టాలీవుడ్లో 2019లో 'ది వాయిస్ ఆప్ విమెన్' ఏర్పాటైంది. టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడటానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని సమంత ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.