దయచేసి పరిశ్రమను నాశనం చేయకండి: మోహన్‌లాల్‌

జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టించడమే కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నది.

By :  Raju
Update: 2024-08-31 10:17 GMT

జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టించడమే కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నది. ఈ వ్యవహారంలో కేవలం అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA)ను లక్ష్యంగా చేసుకోవద్దని 'అమ్మ' మాజీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామన్నారు. ఆ నివేదికను విడుదల చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించడం సరైనదేననని మోహన్‌లాల్‌ తెలిపారు. అయితే అన్ని ప్రశ్నలకు 'అమ్మ' సమాధానం చెప్పడం సాధ్యం కాదన్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అన్నారు. ఇందులో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమన్నారు. ఈ వ్వవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. జూనియర్‌ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పురిశీలిస్తున్నామని చెప్పారు. విచారణకు సహకరిస్తామన్నారు. పరిశ్రమలో పవర్‌ గ్రూప్‌ గురించి తనకు తెలియదన్న మోహన్‌లాల్‌ అందులో తాను భాగం కాదన్నారు. హేమా కమిటీ నివేదికనూ తాను చదవలేదని చెప్పారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇటీవల 'అమ్మ' అధ్యక్ష పదవికి మోహన్‌లాల్‌ రాజీనామా చేసిన విషయం విదితమే. మరోవైపు ఆయన రాజీనామాపై పలువురు నటుల నుంచి విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

డైరెక్టర్‌ రంజిత్‌పై మరో కేసు

హేమ కమిటీ నివేదిక మాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నది. తాజాగా డైరెక్టర్‌ రంజిత్‌పై మరో కేసు నమోదైంది. 2012లో రంజిత్‌ తనను వేధించాడంటూ ఓ నటి ఆరోపణలు చేశారు.

నటి రాధికా శరత్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు

మళయాల చిత్ర పరిశ్రమ మహిళలపై జరుగుతున్న వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ సంచలనం సృష్టించిన నేపథ్యంలో నటి రాధికా శరత్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.వేధింపులు కేవలం మళయాల సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదని రాధికా శరత్‌కుమార్‌ అన్నారు. వానిటీ వ్యాన్లలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

మమ్ముట్టి నిశ్శబ్దంగా ఉండటం బాధాకరం : సజిత మదాతిల్‌

మలయాళం సినిమా ఇండస్ట్రీని హేమ కమిటీ రిపోర్ట్‌ షేక్‌ చేస్తున్నది. ఈ నేపథ్యంలో 'అమ్మ' అధ్యక్ష పదవికి మోహన్‌ రాజీనామా చేశారు. దీనిపై సీనియర్‌ నటి సజిత మదాతిల్‌ స్పందించారు. మోహన్‌లాల్‌ రాజీనామా తనను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. అలాగే ఈ అంశంపై మమ్ముట్టి నిశ్శబ్దంగా ఉండటం బాధాకరని వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News