పడతాం.. లేస్తం... తెలంగాణ కోసమే పోరాడుతాం కానీ తలవంచం : కేటీఆర్
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
- By VamshiLoading...
- | 7 Aug 2024 9:49 AM GMT
X
బీజేపీలో బీఆర్ఎస్లో విలీనం వార్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘24 సంవత్సరాలుగా నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ వ్యతిరేక శక్తులతో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. రాష్ట్ర గుర్తింపు, అభివృద్ధి కోసం మాతో పాటు లక్షలాది హృదయాలు కలిసి కొట్టుకున్నాయి. రహస్య ఎజెండాతో, నిరాధారమైన పుకార్లతో మా పార్టీపై బుదరజల్లే వారికి ఇదే చివరి హెచ్చరిక.
బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేస్తే.. బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకుంటామన్నారు. తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిపాము అని కేటీఆర్ తెలిపారు.ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ తేల్చిచెప్పారు. జై తెలంగాణ..! అంటూ ట్వీట్ చేశారు.