సాయిచంద్ పాట లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు..చిరకాలం నిలిచిపోయే వ్యక్తి : కేటీఆర్
తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలోవారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు కేటీఆర్.
- By VamshiLoading...
- | 29 Jun 2024 11:44 AM GMT
X
తెలంగాణ మలివిడత ఉద్యమంలో సాయిచంద్ పాట లేకుండా ఉద్యమమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాయి తొలి వర్థంతి కార్యక్రమం రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో కేటీఆర్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సాయిచంద్ మరణించి సంవత్సరం అవుతుందంటే ఎవరం నమ్మలేకపోతున్నాని కేటీఆర్ అన్నారు. తన మాటతో, పాటతో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించిన గొప్ప కళాకారుడు సాయిచంద్. మన అందరి ఆప్తుడు.. చిరకాలం మా గుండెల్లో నిలిచపోయే తమ్ముడు. భవిష్యత్లో సాయి కుటుంబం కోసం ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ తరపున ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామన్నారు.
ఆనాటి నుంచి నేటి వరకు ఎలా అండగా ఉన్నామో భవిష్యత్లో కూడా ఉంటాం. సాయి జ్ఞాపకార్థం పాటల సీడీలు, సంకలనాలు, పుస్తకాలు తీసుకొచ్చిన సోదరులకు ధన్యవాదలు తెలిపారు. సాయిచంద్ ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని కోరుకుంటూ కేటీఆర్ తెలిపారు. విద్యార్థి ఉద్యమమైనా, సామాజిక చైతన్య వేదిక అయినా, మలి దశ ఉద్యమమైనా.. వేదిక ఏదైనా సరే సాయి పాటే ఆయుధమన్నారు. ఆయన పాటందుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో ప్రశ్నల సునామీ పుట్టేది. ‘మేం చెప్పులు కుట్టనిదే మీ కాలు బయటకెళ్లదు.. మా డప్పులు లేనిది మీ శవం కాటికెళ్లదు..
ఎవ్వడు జెప్పిండుర మేం తక్కువ జాతోల్లం అని’ అంటూ సమాజంలో జరుగుతున్న దురాచారాలపై ఆయుధం ఎక్కుపెట్టిన సాయిచంద్ సామాజిక చైతన్యాన్ని రగిలించారు. అంతేకాదు, ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలవదురా’ అంటూ నాడు ఉద్యమంలో ఆయన పాడిన పాట యావత్ తెలంగాణను ఉద్యమం దిశగా నడిపించింది. నాడు ఉద్యమ రథసారథి కేసీఆర్ ఎక్కడికెళ్లినా అక్కడికి సాయిచంద్ వెళ్లేవారు. ధూం ధాంలో కాలికి గజ్జె కట్టి ఆడిపాడే సాయిచంద్ అందరిలో తన ఆటపాటతో ఉద్యమ కాంక్షను రగిలించేవారు. అతడు పాట పాడితే సబ్బండవర్గాలు లయబద్ధంగా ఆడేవి. అతడు గజ్జె కట్టి ఆడితే ముల్లోకాలు ఊగేవి. అతడి గొంతులో అంతటి మాధుర్యం ఉండేది. అతని ఆటలో ఎంతటి మహత్తు ఉందో తెలియదు కానీ, ఊరూవాడా సయ్యాటలాడేవి. ధూం ధాం, అలయ్ బలయ్.. వేదిక ఏదైనా ఉండనీ, అక్కడ సాయిచంద్ ఉండాల్సిందే.