సీఎం రేవంత్‌ రెడ్డిపై సుప్రీం కోర్టు సీరియస్‌

వ్యక్తులను, పార్టీలను సంప్రదించి నిందితులకు బెయిల్‌ ఇస్తామా? : జస్టిస్‌ గవాయి

సీఎం రేవంత్‌ రెడ్డిపై సుప్రీం కోర్టు సీరియస్‌
X

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పై సుప్రీం కోర్టు సీరియస్‌ అయ్యింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు చేయడంపై మీడియా చిట్‌ చాట్‌ లో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గవాయి రేవంత్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బెయిల్‌ ఇస్తామా అని రేవంత్‌ రెడ్డి తరపు అడ్వొకేట్లను ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి మీడియా చిట్‌ చాట్‌ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి సుప్రీం కోర్టు పట్ల గౌరవం ఉండాలని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సముచితం కాదన్నారు. ఇలాంటి కండక్ట్‌ ఉన్న వ్యక్తి తెలంగాణ సీఎంగా ఉన్నాడు కాబట్టి తాము ఓటుకు నోటు కేసును పిటిషనర్‌ కోరినట్టు మధ్యప్రదేశ్‌ హైకోర్టు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చు అన్నారు. ఈ దశలో రేవంత్‌ రెడ్డి తరపున వాదిస్తున్న సీనియర్‌ అడ్వొకేట్లు జోక్యం చేసుకొని ముఖుల్‌ రోహత్గీ, సిద్దార్థ లూథ్రా ఇంకోసారి ఇలాంటివి రిపీట్‌ కాకుండా చూసుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మరోసారి రిపీట్‌ కానివ్వబోమనిని, సీఎం కామెంట్స్‌ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అడ్వొకేట్ల విజ్ఞప్తికి స్పందించిన జస్టిస్‌ గవాయి కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Next Story