ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : కేసీఆర్

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలనను అందించిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అన్నారు.

kcr brs
X

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పలు సంక్షేమ పధకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వేములవాడ, నర్సాపూర్‌, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ సమావేశమయ్యారు. తాగునీరు, నిరంతర విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సీఎంఆర్ఎఫ్ పథకాలను నేటి కాంగ్రెస్ కొనసాగించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధినేత అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు గులాబి బాస్ పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా అభిమానులకు కేసీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. సమాచారం లేకుండా వచ్చి ఇబ్బందిపడొద్దని సూచించారు. తనను కలిసేందుకు ముందస్తు సమాచారం లేకుండా రావడంతో మీకూ నాకూ ఇబ్బందేనన్నారు. వచ్చేముందు సమాచారం లేదంటే అనుమతి తీసుకొని రావాలని కేసీఆర్ మరోసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. నియోజక వర్గాల పేర్లను పార్టీ ముందస్తుగా ప్రకటిస్తుందని.. ఆ ప్రకారం స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ తనను కలవడానికి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొద్ది కాలంలోనేదేశానికి ఆదర్శంగా పాలనను అందించిందన్నారు. విద్యుత్‌, సాగునీరు, వ్యవసాయ తదితర రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్‌తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారన్నారు.

బీఆర్‌ఎస్ పాలన లేకపోవడంతో తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతోపాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల దమ్మున్న కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని తెలిపారు. నల్ల చట్టాలను తెచ్చి తమ జీవితాలను, తాము నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని ఆగం చేయాలని చూసిన గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతియుత పోరాటం చేసిన సంగతిని కేసీఆర్ గుర్తుచేశారు. రైతుల మీద లాఠీఛార్జీ, కాల్పులు జరిపి 700 మంది రైతుల మరణానికి నాటి బీజేపీ సర్కార్ కారణమైందన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమలక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకు కేసీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story