స్పెషల్ స్టేటస్ కావాలన్న జేడీయూ, వైసీపీ.. మౌనంగా ఉన్న టీడీపీ
అఖిలపక్ష సమావేశంలో ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తే టీడీపీ మౌనంగా దాల్చింది.
- By RajuLoading...
- | 21 July 2024 12:22 PM GMT
X
తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలని జేడీయూ, బీజేడీలు కోరాయి. వైసీపీ అధినేత జగన్ పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై ఆపార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయడానికి ఢిల్లీకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు సహా ఆపార్టీ నేతలంతా అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడానికే హస్తిన పారిపోయాడని ఎద్దేవా చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తే టీడీపీ మౌనంగా దాల్చింది. కేంద్రం ప్రభుత్వాన్ని నిలబెట్టిన పార్టీలలో జేడీయూ, టీడీపీలదే కీలకపాత్ర. జేడీయూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, భవిష్యత్తులో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు అని తన సామాజికవర్గ మీడియాలో గప్పాలు కొట్టుకోవడమే కానీ ఏపీ ప్రయోజనాల విషయంలోనూ, స్పెషల్ స్టేటస్ గురించి మౌనంగానే ఉండటం గమనార్హం.
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతూ.. కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షత వహించారు. ఈ భేటీకి వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. సమావేశంలో కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ బీహార్కు, వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరడం గమనార్హం. ఒడిషాకు సైతం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని బీజేడీ డిమాండ్ చేసింది.
మరోవైపు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టును విపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతోపాటు వివాదాస్పద నీట్-యూజీ అవకతకలు, ప్రశ్నపత్రాల లీకేజీలను లేవనెత్తింది. కన్వర్ యాత్ర సందర్భంగా దుఆణదారులు తమ పేరు, మతం బోర్డులపై రాయలన్న యూపీ ప్రభుత్వ ఆదేశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కిరెన్ రిజిజు కోరగా.. పార్లమెంటులో అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గగోయ్ కోరారు. నీట్ అంశాన్ని తాను ప్రముఖంగా ప్రస్తావిస్తామని రాజ్యసభ ఎంపీ, ఎగువ సభలో ప్రతిపక్ష ఉప నేత ప్రమోద్ తివారి చెప్పారు. ‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రశ్న పత్రాల లీకేజీ, చైనాతో రక్షణకు సంబంధించిన అంశాలు, పార్లమెంటులో విగ్రహాల తొలిగింపు, రైతులు, కార్మికుల సమస్యలు, మణిపూర్, రైలు ప్రమాదాలు తదితర అంశాలను కాంగ్రెస్ లేవనెత్తుతుంది’ అని తివారి ఒక వార్తా సంస్థకు చెప్పారు.
అఖిలపక్షంలో జేడీయూ బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ను లేవనెత్తిన అంశాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్లో ధృవీకరించారు. ‘అఖిలపక్ష సమావేశంలో జేడీయూ బీహార్కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ నాయకుడు గట్టిగా డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు మాత్రం ఈ విషయంలో మౌనం దాల్చారు’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.