కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. శాసన సభలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపట్ల సబిత భావోద్వేగానికి గురయ్యారు.
- By VamshiLoading...
- | 31 July 2024 11:45 AM GMT
X
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఎం రేవంత్రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని సబితామ్మ తెలిపారు. శాసన సభలో నా పేరులో ప్రస్తావించి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ నుంచి సీఎం దొంగల్లా పారిపోయారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలని సబితామ్మ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారం నశించాలి అని డిమాండ్ చేస్తున్నారు. సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలుగజేసుకుని.. మాజీ మంత్రి సబితా అని పేరు తీసుకోవటంతో ఆమెకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. అయినప్పటికీ స్పీకర్.. ఒవైసీ మాటలను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనను ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలరంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితామ్మ.. తనను ఎద్దేశించే సీఎం ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి తనను టార్గెట్ చేసారని ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని ఆమె ప్రశ్నించారు. సీఎం ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, నా ఇంటి మీద వాలితే కాల్చి చంపేస్తామని రేవంత్ అన్నారని ఆమె వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆలోచన రహితంగా మాట్లాడారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారని భట్టి వ్యాఖ్యానించారని వాపోయారు. దీనిపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. మహిళలకు అసెంబ్లీలో ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని తన సొంత తమ్ముడిగా భావించానని అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన విషయం మహిళా ఎమ్మెల్యేలకే అవమానకరం కాదు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ అవమానకరమని సబితామ్మ అన్నారు.