రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో బంధీలుగా ఉన్న యుద్ధఖైదీల అప్పగింతపై ఇరుదేశాల అధికారులు చర్చలు జరిపారు. ఇందులో భాగంగా 180 మంది యుద్ధఖైదీలను ఇరు దేశాలు మార్చుకున్నాయి.
- By RajuLoading...
- | 26 Jun 2024 10:27 AM GMT
X
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో బంధీలుగా ఉన్న 180 మంది యుద్ధఖైదీలను ఇరు దేశాలు మార్చుకున్నాయి. గత 26 గంటల్లో జెలెన్స్కీ సేనలపై భీకర దాడులు చేసినట్టు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ ఆయుధగారాలు, రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు వెల్లడించింది.
కీవ్ దళాలు ప్రయోగించిన రాకెట్లను తమ గగన తలంలో రక్షణ వ్యవస్థలు మధ్యలోనే కూల్చివేసినట్లు పుతిన్ సేనలు పేర్కొన్నాయి. ఈ పోరులో పైచేయి సాధించినట్లు తెలిపాయి. దీనిపై స్పందించిన కీవ్ రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు దేశాల అధికారులు యుద్ధఖైదీల అప్పగింతపై చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ తమ ఆధీనంలోని 90 మంది రష్యా సైనికులను వారి స్వదేశానికి పంపింది. తమ వద్ద బంధీలుగా ఉన్న యుద్ధఖైదీలను ఉక్రెయిన్ అధికారులకు రష్యా అప్పగించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ సైనికులు స్వదేశానికి చేరుకున్నట్లు ధృవీకరించారు. ఇరు దేశాల మధ్య అతిపెద్ద యుద్ధఖైదీల మార్పిడి 400 మంది బంధీలతో ఈ ఏడాది జనవరి 3న జరిగిన విషయం విదితమే.