తిరుమలగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడ్డారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారు.
- By VamshiLoading...
- | 22 Aug 2024 8:20 AM GMT
X
సుర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. తుంగతుర్తి వెళ్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని తిమ్మాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై దాడికి యత్నించారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. కాగా, రుణమాఫీపై పోరుబాటపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
భూపాలపల్లి జిల్లా పరిషద్ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నా చేస్తున్న ఆమెను అరెస్టుచేశారు. ఇక చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి చొప్పదండి పోలీస్ స్టేషన్కు తరలించారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను అడ్డుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కదంతొక్కారు. అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుం టున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.