రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని మేము అనొచ్చా?: కేటీఆర్
తెలంగాణ హక్కులను ఎవరు హరించినా వారి మెడలు వంచుతామని కేటీఆర్ అన్నారు.
- By RajuLoading...
- | 24 July 2024 8:38 AM GMT
X
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన వివక్షపై తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. చర్చ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టే తీర్మానానికి సంబంధించి సభ్యులకు సమాచారం ఇచ్చేలా తీర్మానం ప్రతిని మాకు ఇవ్వలేదన్నారు. తద్వారా సభ్యులు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందని తీర్మానం ఇవ్వకుండా చర్చ జరపడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి దీనికి సమాధానం చెప్పకుండా కీలకమైన చర్చజరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ అక్కరలేదని మాకు సమాధానం ఇవ్వండి చాలు అన్నారు. దీనిపై మాట్లాడిన సీఎం అవగాహనారాహిత్యంతో సభను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు.
సీఎంకు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం లేనందున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు సభలో ఇలాంటి కీలక సమయంలో సభలో ఎలా వ్యవహరించాలో సూచించారు. దీంతో అసహనానికి గురైన సీఎం రేవంత్ కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా అనుకున్నా.. అంతకంటే దారుణం అన్నారు. తండ్రి పేరు చెప్పుకుని నేను మంత్రి కాలేదన్నారు. కిందిస్థాయి నుంచి ముఖమంత్రిని అయ్యాను.
సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ ధీటుగా బదులిచ్చారు. రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని మేము అనొచ్చా? మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా? సభా నాయకులు అలా విమర్శలు చేయవచ్చా? అని ప్రశ్నించారు. మోడీ సర్కార్ పై తెలంగాణ కోసం మేం అనేక పోరాటాలు చేశామన్నారు. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడాం. తెలంగాణ హక్కులను ఎవరు హరించినా వారి మెడలు వంచుతామన్నారు. మా హయాంలో కేసీఆర్ కేంద్రంతో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్లనే రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగిందని విమర్శించారు. కానీ మేము కేంద్రంతో సఖ్యతతో వ్యవహరిస్తామని, హైదరాబాద్లో సభలో మోడీని పెద్దన్న గా రేవంత్ అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లే కేంద్రం వివక్షపై గళమెత్తుతున్నారు. ఇప్పటికైనా ఢిల్లీ తత్త్వంపై కాంగ్రెస్ కు బోధపడినందుకు సంతోషం అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను మేం సమర్థిస్తున్నామని చెప్పారు.