బీఆర్ఎస్కు బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారు.. వారినే నేతలుగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్
పదేండ్లే బీఆర్ఎస్ పాలన తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామని, ఇలాంటి కీలక సమయంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
- By RajuLoading...
- | 27 Jun 2024 2:56 PM GMT
X
కాంగ్రెస్ పాలనలో అన్నిరంగాల్లో ఆగమైపోతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని మల్లా గాడిలో పెట్టేదాకా, బీఆర్ఎస్ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది అన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదని స్పష్టం చేశారు.
తనను కలవడానికి ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలు ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. పదేండ్లే బీఆర్ఎస్ పాలన తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామని, ఇలాంటి కీలక సమయంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొన్నిసార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతాయని చరిత్రలోకి వెళ్తే అర్థమౌతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లైందని ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అన్నారు.
ఉద్యమంతో పాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకున్నదన్నారు. స్వయం పాలన అనే గమనంలో దేశానికి ఆదర్శవంతమైన పాలనను అందిస్తూ స్వరాష్ట్రంగా పదేండ్లే కాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్నదని కేసీఆర్ గుర్తు చేశారు. బీఆర్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేదిపోయి మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తున్నదని అన్నారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందని కొంతమంది నేతలు బీఆర్ఎస్ను వీడినంత మాత్రానా పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకకర్తలున్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దాతామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చి అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయీలుగా తయారౌతారని కేసీఆర్ తెలిపారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాన్ని గుర్తించి, తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓపికతో ప్రజాసమస్యలపై దృష్టి సారించాలన్నారు. పట్టుదలతో ప్రజల మధ్యే ఉండాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, చైర్మన్లు, సర్పంచులు, తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.