- Home >
- Entertainment >
- Sports
ఆస్ట్రేలియాకు చెక్.. అజేయంగా సెమీస్కు భారత్
టీ20 వరల్డ్ కప్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. వరుస విజయాలు సాధిస్తూ.. ఆస్ట్రేలియాతో సూపర్-8 చివరి మ్యాచ్లోనూ గెలిచి సెమీ ఫైనల్ దూసుకెళ్లింది.
- By RajuLoading...
- | 25 Jun 2024 2:22 AM GMT
X
2003 ప్రపంచకప్లో, 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తుది పోరులో..గత ఏడాది ప్రపంచ కప్లో ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్ ఆశలను ఆవిరి చేసింది. దీంతో కోట్లాదిమంది క్రికెట్ ఫాన్స్ నిరుత్సాపడ్డారు. వీటన్నింటికి నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ సేన బదులిచ్చింది. కంగారు జట్టుకు చెక్ పెట్టింది. ఆ జట్టును ఓడించి అభిమానుల కోరిక నెరవేర్చింది.
టీ20 వరల్డ్ కప్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. వరుస విజయాలతో అద్భుత ప్రదర్శన చేస్తున్నది. ఆస్ట్రేలియాతో సూపర్-8 చివరి మ్యాచ్లోనూ గెలిచి సెమీ ఫైనల్ దూసుకెళ్లింది. సూపర్-8 పోరులో ఆస్ట్రేలియాను భారత్ 24 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (92) దంచికొట్టాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 8 సిక్సర్స్ ఉన్నాయి. సూర్యకుమార్ 16 బంతుల్లోనే 31 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబె (28), హార్దిక్ పాండ్యా (27 నాటౌట్)గా మెరుపులు మెరిపించడంతో భారత్ 20 నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులకు పరిమితమైంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ (76 రన్స్ 9 ఫోర్లు, 4 సిక్సర్) చెలరేగాడు. మిచెల్ మార్ష్ (37) కూడా కీలక ఇన్నింగ్ ఆడాడు. అయినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో అర్షదీప్ 3, కుల్దీప్ 2, అక్షర్, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో పరాజయం, తాజాగా ఈ ఓటమితో ఆసీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. గురువారం సెమీస్లో ఇండియా ఇంగ్లాండ్ను ఢీ కొట్టనున్నది.
రికార్డులు సృష్టించిన రోహిత్
ఈ మ్యాచ్లో సూపర్గా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ పలు రికార్డులను తిరగరాశాడు. టీ20 అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (4145)ను రోహిత్ అధిగమించాడు. అలాగే ఈ మ్యాచ్లో అత్యధికంగా 8 సిక్సర్స్ బాదిన రోహిత్ అంతకు ముందు యువరాజ్ సింగ్ (2007 టీ 20 వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ లో 7 సిక్సులు) రికార్డును తిరగరాశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడు రోహితే (203) .ఆ తర్వాత స్థానంలో గప్తిత్ (173) ఉన్నాడు.