మేం అలర్ట్ గా ఉన్నాం కాబట్టే తక్కువ ప్రాణనష్టం
రాజకీయంగా కేటీఆర్, హరీశ్ సోషల్ మీడియాలో బతికేస్తున్నరు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- By Naveen KameraLoading...
- | 2 Sept 2024 9:24 AM GMT
X
తమ ప్రభుత్వం అలర్ట్ గా ఉంది కాబట్టే భారీ వర్షాలు కురిసినా తక్కువ ప్రాణనష్టం వాటిల్లిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మంలో మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, కేటీఆర్, హరీశ్ రావు రాజకీయంగా సోషల్ మీడియాలోనే బతికేస్తున్నారని, వర్షాలు, వరదలపై వారి విమర్శలు అర్థరహితమన్నారు. బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడ్డీల్లో పడుకోలేదని.. ప్రజల మధ్య ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అనుకోని విధంగా వచ్చిన విపత్తును ఎదుర్కొన్నామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిపాటి వర్షం పడితేనే హైదరాబాద్ మునిగిపోయేదని.. ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ సురక్షితంగా ఉందంటే హైడ్రా ఫలితమేనని అన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించడంతోనే ముంపు తప్పిందన్నారు. పిడుగులు పడుతున్నా లెక్క చేయకుండా విద్యుత్ సిబ్బంది పని చేస్తున్నారని, కరెంట్ సరఫరా పునరుద్దరిస్తున్నారని తెలిపారు. భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లి నిరాశ్రయులయిన వారికి నిత్యావసరాలు అందజేస్తున్నామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. వరద ప్రభావ ప్రాంతాల్లో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మున్నేరువాగు పొంగడంతో ఖమ్మంలో కొంతమేర నష్టం జరిగిందన్నారు. ప్రజలు ఆందోళ చెందవద్దని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.