ప్రశ్నించే గొంతులపై కేసు నమోదు చేయడం ఇదేమి ప్రజా పాలన ? : హరీశ్రావు
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
- By VamshiLoading...
- | 3 July 2024 9:29 AM GMT
X
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ సర్కార్ క్రిమినల్ కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యేే హరీశ్రావు అన్నారు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ఇదేమి ప్రజా పాలన అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పామని ఆయన అన్నారు.
రేవంత్ ప్రభుత్వంలో ప్రతిపక్షలు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తాం అని హరీశ్రావు తేల్చిచెప్పారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ సహా అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అభియోగాలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126(2) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా పరిషత్ అధికారుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.