వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : షర్మిల
వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.
- By VamshiLoading...
- | 4 Sept 2024 4:18 PM GMT
X
వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతంలోని బాధితులను ఆమె పరామర్శించారు. తెలంగాణలో హైడ్రా తరహాలో... బుడమేరు ఆక్రమణలను కూడా వెంటనే తొలగించాలని అన్నారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు. కొంప కొల్లేరయిందని... బెజవాడ బుడమేరు అయిందని షర్మిల కామెంట్స్ చేశారు. బుడమేరు ద్వారా వచ్చే వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
మరోసారి ఇలాంటి విపత్తు రాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని చెప్పారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించి వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ. 1 లక్ష చొప్పున పరిహారం అందించాలని కోరారు. చంద్రబాబు నిరంతరం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెపుతుండటం మంచి విషయమని చెప్పారు. దీంతో ఆయన చేస్తున్న సేవలపై ఆమె ప్రశంసల వర్షం కురుస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.