కాంగ్రెస్ పాలనలో 500 హత్యలు.. 1800 రేప్లు.. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగిన హరీశ్రావు
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు.
- By VamshiLoading...
- | 27 July 2024 1:14 PM GMT
X
తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నదని సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 8 నెలల పాలనలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్పై సాధారణ చర్చ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. రేవంత్ సర్కార్ వచ్చిన 8 నెలల్లో హత్యలు 500, డకాయిటీస్ 60, దోపిడీలు 400, దొంగతనం కేసులు 10 వేలు, రేప్ కేసులు 1800 నమోదైనట్లు హరీశ్రావు తెలిపారు. పోయిన ఒక్క నెలలోనే హైదారాబాద్ నగరంలో 28 మర్డర్లు జరిగాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి తన వద్దే హోం శాఖ పెట్టుకుని ఏం చేస్తున్నారని హరీశ్రావు నిలదీశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా చేశామని హరీశ్రావు గుర్తు చేశారు.
గంగా జమునా తెహజీబ్ను మత సామరస్యాన్ని కాపాడినం. కరువులు, కర్ఫ్యూలు లేని పరిపాలన అందించినం. మీరు రివ్యూలకోసం చాలా సౌకర్యంగా కూర్చుంటున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం, సచివాలయ భవనం కూడా మా హాయంలోనే నిర్మించామన్న సంగతి మరిచిపోకండి. మీరు వద్దన్నా ఆ భవనాలు మీకు గుర్తుచేస్తాయి. ముఖ్యమంత్రి గురువు సారీ సహచరుడైన చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యనే హైదరాబాద్లో జరిగిన సభలో కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చాలా అభివృద్ధి జరిగింది అని ప్రకటించారు. ప్రత్యర్థులు కూడా ప్రశంసించేలా మేము హైదరాబాద్ను అన్ని కోణాలలో అభివృద్ధి చేశాం. కుట్ర పూరితంగా మీరు కాదన్న మాత్రాన కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి అదృశ్యమై పోదు అని హరీశ్రావు పేర్కొన్నారు.