ఐఏఎస్ నుంచి పూజా ఖేడ్కర్ ను తొలగించిన కేంద్రం
ప్రొబేషనరీ ఐఏఎస్ గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు
- By Naveen KameraLoading...
- | 7 Sept 2024 1:28 PM GMT
X
వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) నుంచి ఆమెను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ (ప్రొబేషన్) రూల్స్, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. పూణేలో ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తప్పుడు అఫిడవిట్ లు సమర్పించారనే వివాదం కొనసాగుతోంది. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన యూపీఎస్సీ ముస్సోరిలోని శిక్షణ కేంద్రానికి తిరిగి రావాలని గతంలోనే ఆదేశించింది. నకిలీ గుర్తింపు పత్రాలతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేసినట్టు గుర్తించి వాటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేసి ఐఏఎస్ సెలక్షన్ ను రద్దు చేసింది. యూపీఎస్సీ నిర్ణయంపై ఆమె న్యాయపోరాటం చేస్తోంది. తాను ఏ పత్రాలు కూడా ఫోర్జరీ చేయలేదని కోర్టుకు నివేదించారు. డీవోపీటీకి మాత్రమే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముందని, యూపీఎస్సీకి కాదని కోర్టులో వాదిస్తున్నారు. ఈక్రమంలోనే ఆమెపై వేటు వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూజా కేడ్కర్ ను ఐఏఎస్ నుంచి తొలగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి