క్రియాశీల రాజకీయాలవైపు యువత మొగ్గు: ప్రధాని
భారత్లో 21వ శతాబ్దంలో ‘వికసిత్ భారత్’ పునాదిని పటిష్టం చేసే ఎన్నో విషయాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.ఆదివారం ప్రసారమైన 113వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
- By RajuLoading...
- | 25 Aug 2024 6:47 AM GMT
X
ప్రధాని నరేంద్రమోడీ 2014లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలతో ఏదో విధంగా నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమమే మన్ కీ బాత్. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రధాని ఆకాశవాణిని ఎంచుకున్నారు. 2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ పారిస్ ఒలింపిక్స్లో భారత్ గెలుచుకున్న పతకాలు, ప్రదర్శన గురించి కొనియాడారు. అలాగే పారా ఒలింపిక్స్లో పాల్గొనబోయే భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల గురించి ప్రజల తన అనుభవాలు పంచుకున్నారు. అలాగే నేపాల్ లో ఉత్తరప్రదేశ్ బస్సులో 41 మంది మరణించడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తున్నది. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది మొదటిసారి అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది. స్పేస్ సైన్స్ యువత దృష్టిని ఆకర్షిస్తున్నదని ప్రధాని తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలన్న పిలుపుతో యువత నుంచి స్పందన వచ్చిందని, క్రియాశీల రాజకీయాలవైపు యువత మొగ్గు చూపుతున్నదని ప్రధాని తెలిపారు.రాజకీయ నేపథ్యం లేని యువకులు రాజకీయాల్లోకి రావడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఏడాది 'హర్ ఘర్ తిరంగా' ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవం అనేది సామాజిక ఉత్సవంగా మారింది. వెబ్సైట్లో 5 కోట్ల కు పైగా ఫొటోలు అప్లోడ్ చేశారు. ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవమని తెలిపిన ప్రధాని ముందస్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.