విద్యార్థులను ఎలుకలు కరుస్తుంటే రేవంత్ ఏం చేస్తున్నారు?
ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని హరీశ్ డిమాండ్
- By RajuLoading...
- | 29 Aug 2024 6:20 AM GMT
X
గురుకులాల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన పట్ల మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతుల కల్పనపై తక్షణమే చర్యలు చేపట్టాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. విపక్షాలపై నోటికొచ్చినట్లు మాట్లాడటం మానేసి ఇప్పటికైనా పాలనపై దృష్టి సారించాలని సూచించారు. కేసీఆర్ హయాంలో వెలుగొందిన గురకులాలు రేవంత్ పాలనలో నిర్లక్ష్యం వల్ల మసకబారుతున్నాయని.. వాటి దుస్థితిపై ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
మొన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి. నిన్న నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి అని పేర్కొంటూ..మిస్టర్ రేవంత్ రెడ్డి..గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావ్ .? పాముకాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ఏం చేస్తున్నావ్.? కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావ్.? అని నిలదీశారు.
గత 8 నెలల కాలంలో 500 మంది పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే, 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల అధ్వాన్న పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న నువ్వే బాధ్యుడివని మండిపడ్డారు. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే అందుకు నిదర్శనం అన్నారు.కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయి. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.