ఇంజినీరింగ్ కాలేజీలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
నిరుద్యోగులుగా తయారుచేసే పరిశ్రమలుగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉండవద్దని సీఎం అన్నారు.
- By RajuLoading...
- | 13 July 2024 11:37 AM GMT
X
ఇంజినీరింగ్ కాలేజీలకు సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. జేఎన్టీయూ పరిధిలోని కళాశాలలు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వ విధానం తెలియాలి అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.జేఎన్టీయూలో నిర్వహించిన 'నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య' అనే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యంతో సీఎం, మంత్రి శ్రీధర్బాబు, వీసీ బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తొలిసారి ఫీజు రీయింబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచంలోని దేశాల్లో గొప్పగా ఏదైనా ఉంటే దానిని చేసింది ఇంజినీర్లే అన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలకు సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. జేఎన్టీయూ పరిధిలోని కళాశాలలు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వ విధానం తెలియాలి అన్నారు. లక్ష మంది ఇంజినీరింగ్ పట్టాలు పొందిన వారికి మా ప్రభుత్వ విధానం తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసే విధంగా ప్రస్తుత కార్యక్రమం ఉన్నదన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకమని సీఎం పేర్కొన్నారు.
నిరుద్యోగులుగా తయారుచేసే పరిశ్రమలుగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉండవద్దని సీఎం అన్నారు. సివిల్ ఇంజినీరింగ్ అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైందన్నారు. కొన్ని కాలేజీల్లో సివిల్ ఇంజినీరింగ్ లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నడపాలని సీఎం స్పష్టం చేశారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు.
ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందించే సంస్థలు ఉండాలి. గత సీఎంలు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నామని సీఎం తెలిపారు. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు ఉండాలని సూచించారు. ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతున్నది. రాష్ట్రంలోని కళాశాల్లలో ఏఐకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. ఏఐకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుంది అన్నారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని పెడుతామన్నారు. ఆ యూనివర్సిటీకి అటానమస్ హోదా ఇస్తామన్నారు. పక్కరాష్ట్రాలతో పోటీపడే విధంగా కాకుండా ప్రపంచంతో పోటీ పడేవిధంగా మనం తయారుకావాలన్నారు.