గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తాం: రంగనాథ్
చెరువుల పరిధిలోని అక్రమణలు గుర్తిస్తున్నాం. చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
- By RajuLoading...
- | 12 Aug 2024 7:13 AM GMT
X
ప్రభుత్వ ఆస్తులు, స్థలాల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. తాజా బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించింది. హైడ్రా పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కబ్జాదారుల నుంచి పార్కు స్థలాలు, చెరువు బఫర్ జోన్ భూములు కాపాడటం హైడ్రా చేయాల్సిన పని. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది.ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ...హైడ్రా కార్యాచరణను వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కు పైగా ఉన్నాయి. హైడ్రా చెరువులను ప్రధానంగా తీసుకున్నది. ఎస్ఆర్ఎస్సీ నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు లేవు. చాలా చెరువులు 60 శాతం, కొన్ని చెరువులు 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. చెరువుల పరిధిలోని అక్రమణలు గుర్తిస్తున్నాం. చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని, ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంటుందన్నారు.
2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉంది. ప్రజల నుంచి తమకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని, దశల వారీగా హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ తెలిపారు.మొదటి దశలో ఆక్రమణలు అడ్డుకోవడం, రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ, మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునర్జీవనం కల్పిస్తామన్నారు.చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయని .. అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయని ఆ చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తామని రంగనాథ్ తెలిపారు.
పార్కు స్థలాల్లో ఫెన్సింగ్ వేసేందుకు కాలనీ సంఘాలకు సహకరిస్తున్నాం. బస్తీ వాసుల జీవన ప్రమాణాలు పెరగాలి. నందగిరి హిల్స్ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదన్నారు. చందానగర్లో గత ఏడాది బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు చూస్తారని తెలిపారు.