తెలంగాణ పర్యాటకాన్ని సరికొత్తగా ప్రపంచానికి తెలియజేస్తాం : మంత్రి జూపల్లి
థాయిలాండ్లో పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గోన్నారు
- By VamshiLoading...
- | 28 Aug 2024 12:32 PM GMT
X
తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యాంకాక్లో క్వీన్ సిరికిట్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పసిఫిక్ ఆసియా ట్రావెల్ మార్ట్లో మంత్రి పాల్గోన్నారు. ఈ ట్రావెల్ మార్ట్లో తెలంగాణ పర్యాకట శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ను మంత్రి జూపల్లి ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు చారిత్రక, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, స్థలాల ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ పర్యాటక సంస్థ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసింది.
అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించేలా నాగర్జున సాగర్ లోని బుద్దవనం, హైదరాబాద్ లోని చార్మినార్, ములుగు జిల్లాలోని లక్నవరం తీగల వంతెన ఛాయా చిత్రాల్ని ప్రదర్శించింది. ప్రపంచంలో ఏ దేశానికీ లేనన్ని రకాల పర్యాటక సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యావరణ, అనువైన రంగాలు భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయని మంత్రి అన్నారు. ఈ ట్రావెల్ మార్ట్ ద్వారా తెలంగాణ పర్యాటక అందాలను ప్రపంచానికి తెలియజేసే అవకాశం దక్కిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలికవసతుల కల్పనతో ముందుకెళ్తున్నట్లు జూపల్లి తెలిపారు.
పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు థీమ్ ఆధారిత బుద్దిస్ట్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ నూతన పర్యాటక విధానంలో ఇలాంటి వాటికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానం వంటివి పర్యాటకాభివృద్దికి సానుకూలమైన అంశాలని, ప్రకృతితో మమేకమైన జీవించాలన్న ఆలోచనను ప్రతిబింబిస్తాయని మంత్రి వివరించారు.