ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలుల బీభత్సం
15 కిలోమీటర్ల వ్యవధిలో సుమారు 150 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు 50 వేల చెట్లు నేలకూలాయి
- By RajuLoading...
- | 4 Sept 2024 5:08 AM GMT
X
ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 21 సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు నష్టం జరిగింది. 15 కిలోమీటర్ల వ్యవధిలో సుమారు 150 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు 50 వేల చెట్లు నేలకూలాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, ఇతర అధికారులు అడవిలో సర్వే చేపట్టారు.
ఐఎండీని సంప్రదించేందుకు అటవీ అధికారులు
నివేదికల ప్రకారం ములుగు అటవీప్రాంతంలో కనిపించిన దృశ్యాలను చూసి అటవీ అధికారులు షాక్ అయ్యారు. తుపానుల ఫలితంగా వచ్చే శక్తివంతమైన సుడిగాలులు ఈ విధ్వంసానికి దారితీసి ఉండవచ్చని వారు చెప్పారు. ఈ గాలులు టోర్నడోల కంటే భిన్నమైనవన్న అధికారులు గంటకు 50 మైళ్ల వేగంతో గాలులు ఉంటాయిని అదే స్థాయిలో విధ్వంసం సృష్టిస్తాయని చెప్పారు.
చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా
ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. పీసీసీఎప్, డీఎఫ్వోలతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. లక్ష చెట్ల వరకు నేలకూలడం పట్ల సీతక్క విస్మయం చెందారు. చెట్లు కూలడంపై మంత్రి విచారణకు ఆదేశించారు. నష్టాన్ని డ్రోన్ కెమెరాల సాయంతో అంచనా వేయాలని ఆదేశించారు.