29న కొండగట్టుకు పవన్..అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు
ఈనెల 29న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్లి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు జనసేన నేతలు తెలిపారు
- By VamshiLoading...
- | 26 Jun 2024 6:21 AM GMT
X
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈనెల 29న ఆయన జగిత్యాల జిల్లా కొండగట్టుకు రానున్నారు. శనివారం నాడు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పవన్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. వారాహి దీక్షలో భాగంగానే పవన్ కల్యాణ్ తమ ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.
ఏపీలో ఎన్నికలకు ముందు వారాహియాత్ర పూజలు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జులై 1వ తేదీ నుంచి తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. అదేరోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు.
తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. మూడు రోజులపాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు.