విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు బంద్
ఏపీలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు.
- By VamshiLoading...
- | 1 Sept 2024 10:34 AM GMT
X
ఏపీలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు భారీగా చేరింది. దీంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మునేరు, వైరా, కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రహదారిపైకి నీరు చేరింది.
రోడ్డుకు రెండువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు పేర్కొన్నారు. మహబూబాబాద్ వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే రైళ్లు నిలిచిపోయాయి. అటు రైళ్లలో వెళ్లే మార్గం లేక, ఇటు బస్సులు కూడా నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు కూడా నిలిచిపోగా... ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు విజయవాడ బస్టాండ్ లో తీవ్ర అవస్థలు పడుతున్నారు.