విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించడానికి రేవంత్‌ కుట్ర: జగదీశ్‌రెడ్డి

విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించడానికి రేవంత్‌ కుట్ర చేస్తున్నారు. ఇది పాతబస్తీకే పరిమితం కాదని, రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రయివేటు చేతిలోకి వెళ్తుందని మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.

విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించడానికి రేవంత్‌ కుట్ర: జగదీశ్‌రెడ్డి
X

ఓల్డ్‌ సిటీలో విద్యుత్ బిల్లుల వసూలును ప్రయివేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతున్నది. బిల్లుల వసూలును అదానీకి అప్పగించడానికి రేవంత్‌ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రయివేటు వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లులు వసూలు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న పాతబస్తీకే పరిమితం కాదన్నారు. రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రయివేటు చేతిలోకి వెళ్తుంది. విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. విద్యుత్ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఇక రాష్ట్రంలో వుండదు. రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడతారని మాజీ మంత్రి హెచ్చరించారు.

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని కేసీఆర్ అంగీకరించలేదు కానీ కేంద్ర ప్రభుత్వం, మోడీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మోడీ, అదానీ విధానాలను తెలంగాణలో సీఎం అమలు చేస్తున్నారు. విద్యుత్ సంస్థ ప్రజల ఆస్తి. దీన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారు. ఓల్డ్ సిటీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలవుతున్నాయి. అందుకే ప్రయివేటు వ్యక్తులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో 95 - 97 శాతం వరకు కరెంటు బిల్లులు వసూలవుతున్నాయి. ఓల్డ్ సిటీ ప్రజలను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు వున్నాయని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.

సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి వేలంలో పాల్గొన్నారు. శ్రావణపల్లి బొగ్గు గనిని వేలం నుంచి ఎందుకు తీసివేయించలేదు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదు. సింగరేణి బొగ్గు గనులను లీజుకు తీసుకున్న కంపెనీలను మేము అనుమతించమని బీఆర్ఎస్ ఇప్పటికే అభిప్రాయం చెప్పిందని తెలిపారు.

విద్యుత్ బిల్లుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలిపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ ప్రభుత్వ విధానాల వల్ల విద్యుత్ ఉద్యోగుల పాత్ర నామమాత్రంగా మారే అవకాశం ఉన్నది. ప్రయివేటు వాళ్లకు అప్పగిస్తే విద్యుత్ వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఓల్డ్ సిటీలో 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. మరి బిల్లుల వసూలు ను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విద్యుత్‌ బిల్లుల వసూలు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించనున్నదనే వార్త అన్ని పత్రికల్లో వచ్చింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు విద్యుత్ శాఖా మంత్రి మాట్లాడలేదనే విషయాన్ని జగదీశ్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Raju

Raju

Writer
    Next Story