రంగనాయక సాగర్ జలదృశ్యాన్ని చూస్తే మనసు పులకరిస్తుంది : హరీశ్రావు
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ ప్రాజెక్టు గోదావరి జలాల ఎత్తిపోతలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం పరిశీలించారు.
- By VamshiLoading...
- | 11 Aug 2024 10:39 AM GMT
X
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి నిండు కుండలా తలపిస్తోంది. ఈ ప్రాజెక్టు గోదావరి జలాల ఎత్తిపోతలను మాజీ మంత్రి హరీశ్రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రైతులకు నీరందించాలనే నిత్య తపనకు ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు. అన్నదాతల ఆనందమే, వారి ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. ఈ నీళ్లుని చూస్తుంటే మనసు పులకరించిపోతోందని హరీశ్రావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ జలాశయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దిగువన పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా నందిమేడారంలోని నంది పంప్హౌస్కు జలాలు చేరుతుండగా, శనివారం ఒక మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు తరలిపోతున్నాయి.
ఇక్కడ కూడా ఒకే మోటర్ నడిపిస్తున్నారు.మొత్తం 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి నుంచి 13 టీఎంసీలకుపైగా జలాలు మధ్య మానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు జలాశయంలో 27.54 టీఎంసీల నీటి సామర్థ్యానికిగాను ప్రస్తుతం 17.06 టీఎంసీల నీటి నిలువ ఉన్నట్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు నుంచి సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు.