రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని నిర్దిష్ట హామీ: మందకృష్ణ
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోడీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు.
- By RajuLoading...
- | 10 Aug 2024 6:11 AM GMT
X
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోడీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. నిన్న ప్రధానితో మందకృష్ణ భేటీ అయ్యారు. రిజర్వేషన్లు రాష్ట్రాల్లో అమలయ్యేలా ఆయా ప్రభుత్వాలకు సూచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇవాళ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారం కావడంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాత్ర ఎంతో ఉన్నదన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో పాటు ధర్మాసనంలో ప్రతి న్యాయమూర్తి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణకు మద్దతుగా నిలబడిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు చెప్పారు.
సుప్రీం తీర్పును దక్షిణాది నలుగురు సీఎంలు వెంటనే స్వాగతించారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో దళితులు, అతి దళితులుగా పేర్కొంటూ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడానికి రాష్ట్రాలు త్వరగా మందుకు రావాలన్నారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్రాల్లో వెంటనే అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదు. ఏ రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమాలు వచ్చాయో అక్కడ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్లు త్వరగా అమలు చేసేలా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.