వరద బాధితులకు పవన్కల్యాణ్ రూ. కోటి విరాళం
బుధవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేస్తానన్న డిప్యూటీ సీఎం
- By RajuLoading...
- | 3 Sept 2024 3:00 PM GMT
X
ఏపీ సీఎం సహాయనిధికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళం ప్రకటించారు. విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధికి నా వంతుగా రూ. కోటి విరాళం ఇస్తున్నాను. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేస్తాను అన్నారు. ప్రస్తుతం వరద తగ్గుతున్నదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ తీరుతోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న పవన్ పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. సహాయం కోసం112, 1070, 18004250101 ఫోన్ చేయాలన్నారు. ప్రకృతి విపత్తు సమయంలో నిందల కంటే ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలన్నది మంత్రివర్గంలో చర్చిస్తామని పవన్ తెలిపారు. ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. వరద నిర్వహణ కోసం బృహత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నాను.కానీ నా వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావిస్తున్నట్లు చెప్పారు. నా పర్యటన సహాయపడేలా ఉండాలి గాని అదనపు భారం కాకూడదన్నారు.