రంకెలేస్తే అంకెలు మారిపోవు.. రుణమాఫీ అయిపోదు: హరీశ్
బూతులు తిడితే రుణమాఫీ అయిపోతుందా? ఖాతాల్లో డబ్బులు పడతాయా? తొండి చేసుకుంట మొండిగ మాట్లాడుతున్నావు.. రంకెలేస్తే అంకెలు మారిపోవు. అబద్దాలు నిజమైపోవు అని సీఎం రేవంత్పై హరీశ్ మండిపడ్డారు.
- By RajuLoading...
- | 17 Aug 2024 9:25 AM GMT
X
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని బిగ్గరగా అరిచినట్లు ఉన్నది. రుణమాఫీ ఎగనామం పెట్టి రేవంత్రెడ్డి ఫోజులు కొడుతున్నారు.మాఫీ పాక్షికంగా అమలుచేశారు తప్ప పూర్తిగా చేయలేదని కాబట్టి తప్పందైని రైతులను క్షమాపణ అడగాలని లేదా రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రేవంత్ నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే లాభం ఉండదన్నారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఆ పథకం కింద అర్హులైన వారు ఎంతమంది? ఎందరికి రుణమాఫీచేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. కాంగ్రెస్ 26 లక్షల మందికి కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రుణమాఫీ సంపూర్ణంగా చేశామని రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని హరీశ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ రుణమాఫీ కథ ఎట్లుందంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా 40వేల కోట్ల రూపాయల రుణ మాఫీ ఏకకాలంలో చేస్తానని రేవంత్ చెప్పారు. ఏమైంది. డిసెంబర్ 9 మాట తప్పిండు. ఇలా ఉత్తగా తేదీలు చెబితే ప్రజలు విశ్వసించరని పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కడానికి కనిపించిన దేవుడిపై ఒట్లు పెట్టి అదే నోటితో 31వేల కోట్లు ఆగస్టు 15 కల్లా చేస్తానన్నారు. రుణమాఫీ చేయాలంటే మొదట 40వేల కోట్లు అవసరం అన్నారు. తర్వాత 31 వేల కోట్లు, బడ్జెట్ లోనేమో 26 వేల కోట్లు పెట్టారు. మొన్న ఆగస్టు 15 స్వాతంత్య్రం దినోత్సవం నాడు రుణమాఫీ అయిపోయిందని ప్రకటించారు. తీరా లెక్కలు చూస్తే కేవలం 17వేల కోట్లతో 22లక్షల మందికి చేశారని లెక్క తేలింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 40వేల కోట్లు చెప్పి, తీరా చేసింది ఎంతంటే 17వేల కోట్లు. అంటే 23వేల కోట్లు కోత పెట్టారని హరీశ్ ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ఎన్నికలపుడు రైతుల సంఖ్య 47లక్షలు అని చెప్పి మూడు విడతలకు 22 లక్షల మంది రైతులకు చేశారు. అంటే చెప్పిన సంఖ్యకు సగం కూడా చెయ్యలేదు. లెక్కచేస్తే 46శాతం మంది రైతులకే చేసినట్లు సుమారు 25లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టినట్లు తన రికార్డులే చెబుతున్నాయి. ఈ పాటి పోటు పనికి సిగ్గులేకుండా తను తన వందిమాగధులు కలిసి రుణమాఫీ చేసినమని చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డిది నోరా మోరా...
మొదటి దఫా మేము లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తేనే 36లక్షల మంది రైతులకు 17వేల కోట్ల ప్రయోజనం చేకూరింది.మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య పెరగాలి. డబ్బులు డబుల్ కావాలి. అటువంటిది రైతుల సంఖ్య దాదాపు 14లక్షలు ఎట్ల తగ్గింది? డబ్బులు కూడా అవే 17వేల కోట్లకు అటు ఇటుగా ఉన్నది. ఎవర్ని మభ్యపెడుతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎవర్ని మోసం చేస్తున్నారు అని ప్రశ్నించారు. రైతులందరికి రుణమాఫీ అయ్యిందని దమ్ముంటే నిరూపించాలని రేవంత్ రెడ్డికి హరీశ్ సవాల్ విసిరారు. ప్లేసు, డేటు, టైము చెప్పు. ఏ జిల్లాకు పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం. మీ నియోజకవర్గం లేదా నా నియోజకవర్గం.. ఎక్కడికైనా పోదామని నేనంటన్నది కరెక్టో, మీరంటున్నది కరెక్టో ఖుల్లం ఖుల్లా తెలుస్తుందన్నారు. మీ ప్రకటనల డొల్లతనం కూడా బయట పడుతుంది. వస్తరా? పోదామా రేవంత్ రెడ్డి? అని సవాల్ విసిరారు.తాను సీఎం రేవంత్లాగా మాట తప్పెటోడిని కాదన్నారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి పార్టీలు మారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర కాదు నాది కాదన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినోడినని, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు లెక్కపెట్టకుండా రాజీనామాలు చేసినోడినని.. కానీ చంద్రబాబు చంకల జొర్రి రైఫిల్ పట్టుకున్నచరిత్ర మీదని ఫైర్ అయ్యారు.
రుణమాఫీ చేయమంటే వ్యక్తిగతంగా దూషణలా?
సంపూర్ణంగా రుణమాఫీ చేయమని అడిగితే తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జూన్, జులై నెలల్లోనే రైతుబంధు డబ్బులు అందించామని గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు అన్నారు, కౌలు దారులకు అన్నారు అందరికి ఎగనామం పెట్టారు. రైతు బంధు పైసలు ఎగ్గొట్టి, ఆ పైసలు ఇటు డైవర్ట్ చేసి తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి డప్పు కొట్టుకుంటున్నారు, డబ్బా వాయిస్తున్నారు. ఇట్లా తొమ్మిది నెలల రేవంత్ ప్రభుత్వం అన్నింటిలో విఫమైందని విమర్శించారు. రుణమాఫీ చేయకుండా చేతులెత్తేసిన రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారం రుణమాఫీలో కోత మాటల్లో రోతలా ఉన్నదని విమర్శించారు.
తొండి చేసుకుంట మొండిగ మాట్లాడుతున్నావు
ఆగస్టు 6న తెలంగాణ భవన్ లో రుణమాఫీ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఫోన్ కాల్స్, వాట్సప్ ద్వారా గడిచిన 10, 11 రోజుల్లో లక్ష 16 వేల ఫిర్యాదులు వచ్చాయి. రుణమాఫీ కాలేదు న్యాయం చేయాలని రైతులు ఆవేదన చెందుతున్నరు. ఊళ్లల్లకు పోతే రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రుణమాఫీ కోసం అగ్రికల్చర్ ఆఫీస్, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అధికారుల కాళ్ల వేళ్ల మీద పడి వేడుకుంటున్నారు. ఓపిక నశించి బ్యాంకుల ముందు నిరసన తెలుపుతున్నారు. ఇదంతా అబద్ధమా రేవంత్ రెడ్డి. రోజూ పత్రికల్లో, టీవీల్లో వస్తున్నవే కదా? రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు మీరు రుణమాఫీ చెయ్యక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవహరిస్తున్నది. దమ్ముంటే రుణమాఫీ మీద శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు రాజీనామా చేయాల్సింది పోయి, సిగ్గులేక చోర్ ఉల్టా కొత్వాల్ కో డాంట అన్నట్లు తనను రాజీనామా చెయ్యమనడంపై హరీశ్ మండిపడ్డారు. బూతులు తిడితే రుణమాఫీ అయిపోతుందా? ఖాతాల్లో డబ్బులు పడతాయా? తొండి చేసుకుంట మొండిగ మాట్లాడుతున్నావు.. రంకెలేస్తే అంకెలు మారిపోవు. అబద్దాలు నిజమైపోవు మండిపడ్డారు.
మమ్మల్ని తిట్లు తిడుతవ్ కావొచ్చు, కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్ల మర్చిపోతావు? హిందు, ముస్లిం, క్రిస్టియన్లు నమ్ముకున్న దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేశారు. రైతులనే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డారు. పాలకుడిగ మీరు పాపం మూటగట్టుకున్నారు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటుంది. ఊర్లల్ల అదే భయ పడుతున్నారు. దేవుళ్ళ మీద నిజమైన భక్తీ ఉన్న ప్రతి వ్యక్తీ నువ్వు చేసిన పాపం చూసి భయ పడుతున్నాడు. మీరా ప్రాయశ్చిత్తం చేసుకోరు.మీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేను తీర్థ యాత్రకు బయలుదేరుతా. మా పార్టీ సీనియర్ నాయకులు కూడా వస్తారు.ముక్కోటి దేవతల్ని, అల్లా, జీసస్ లను వేడుకుంటా.. ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు కీడు చేయొద్దని వెడుకుంటానన్నారు
మీ తాటాకు చప్పుళ్లకు భయపడం
మీ తాటాకు చప్పుళ్లకు భయపడం మిస్టర్ రేవంత్ రెడ్డి.రుణమాఫీ విషయంలో మాట తప్పావ్ ఫెయిల్ అయ్యావు. రుణమాఫీ రైతులందరికీ చేసే దాకా, రైతు భరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదన్నారు. బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తాం. మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. పార్టీ తరుపున త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. రైతుల తరుపున పోరాటం చేస్తామన్నారు.