పావలా శ్యామలకు మెగా హీరో సాయిధరమ్ సాయం

ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్‌ సీనియర్‌ నటి పావలా శ్యామలకు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆర్థికసాయం చేశారు. రూ.లక్షను అందజేశారు.

sai dharam tej
X

టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు మెగా హీరో రూ.లక్ష రూపాయల సహాయం అందించాడు. సాయి ధరమ్ అందించిన సహాయానికి పావలా శ్యామల భావోద్వేగానికి గురయ్యారు. కొన్నేళ్ల క్రితం మా అమ్మాయికి ఆపరేషన్‌ జరిగినప్పుడు సాయిధరమ్‌ నాకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. వచ్చి కలుస్తా అనికూడా చెప్పారు. రాలేదు. నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. కానీ, గుర్తుపెట్టుకొని మరీ ఇప్పుడు నాకు సాయం అందించారు. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు.. అని తెలిపారు పావలా శ్యామల. అనంతరం, ఆమె.. సాయిధరమ్‌తేజ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు. ‘

‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. చనిపోదామనుకున్నా. సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే కష్టంగా ఉంది. ఏడవకండి’’ అంటూ ఆయన ఓదార్చారు. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌కు సాయిధరమ్‌తేజ్‌ రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందులోభాగంగా రూ.లక్షను ఆమెకు అందజేయడం జరిగింది. టాలీవుడ్ పలు సినిమాల్లో హాస్యనటి, సహాయనటిగా కనిపించారు పావలా శ్యామల. ‘గోలీమార్‌’, ‘మనసంతా నువ్వే’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘మత్తువదలరా’ తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఆమె తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ గతంలో ఆర్థికసాయం అందించిన విషయం తెలిసిందే.


Vamshi

Vamshi

Writer
    Next Story