విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం
ఉపాధ్యక్షుడు సహా 10 మంది మృతి
- Byline VamshiLoading...
- | 11 Jun 2024 11:44 AM GMT
X
ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవి ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లే తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది దుర్మరణం చెందినట్లు పేర్కొన్నారు. వాతవరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది.
ఈ క్రమంలోనే రాడార్తో విమానం సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కోసం మలావీ సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించేందుకు ముందుకువచ్చాయని మలావీ సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.