సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
- By RajuLoading...
- | 2 Aug 2024 6:34 AM GMT
X
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సైబర్ క్రైంకు సంబంధించి కొత్త చట్టాలు తెస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. సభను అప్రతిష్టపాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో విపక్షాలు అధికారపార్టీకి సూచనలు చేశారు. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా న్యాయ వ్యవస్థ కొట్టు మిట్టాడుతున్నది. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని అంశాలను పరిష్కరించాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన న్యాయ చట్టాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు.
బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సవరణ బిల్లును సమర్థిస్తూ కొన్ని సూచనలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవు. కిరాయి భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరం అన్నారు. నియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవని , కేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలన్నారు.
మరో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. బిల్లు పెట్టిన రోజే అమోదం చేసుకోవడం సరికాదన్నారు. బిల్లు ప్రవేశపెట్టి, ప్రిపేర్ అవ్వడానికి సభ్యులకు రెండు రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమయం ఇవ్వకుండా, చర్చ జరపకుండా బిల్లలు ఆమోదం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది పార్లమెంటు నిబంధలకు విరుద్ధంగా ఉన్నదని, సభ పార్లమెంటు నిబంధనలు పాటించాలని కోరారు.ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రకటించాయి.