హైకోర్టు ఆదేశాలకు లోబడే హైడ్రా కూల్చివేతలు
అధికారులకు సీఎస్ శాంతి కుమారి ఆదేశం
- By Naveen KameraLoading...
- | 29 Aug 2024 11:43 AM GMT
X
హైడ్రా కూల్చివేతలు హైకోర్టు ఆదేశాలకు లోబడే ఉండాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం సెక్రటేరియట్ లో హైడ్రా పరిధి, కూల్చివేతలపై ఉన్నతాధికారులతో ఆమె హైలెవల్ రివ్యూ నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ఇకపై పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సి ఉందన్నారు. హైడ్రాకు మరికొన్ని అధికారాలు అప్పగించడంతో పాటు అదనంగా సిబ్బందిని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల తొలగింపుపై ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వురుగా నోటీసులు ఇస్తున్నాయని, దీంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుందన్నారు. దీనిని నివారించడానికి ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని ఆక్రమణల తొలగింపునకు హైడ్రానే నోటీసులు ఇచ్చేలా గైడ్ లైన్స్ తయారు చేయాలని ఎంఏయూడీ సెక్రటరీని ఆదేశించారు. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యతలను జల మండలి నుంచి హైడ్రా పరిధిలోకి తెస్తామన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో 72 టీములు పని చేస్తున్నాయని, వాటికి అవసరమైన ఆయా శాఖల సిబ్బందిని వీలైనంత త్వరగా బదలాయించాలని ఆదేశించారు. సమీక్షలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానాకిశోర్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఏఏజీ రజనీకాంత్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, కలెక్టర్లు శశాంక, గౌతమ్ పౌత్రు, వల్లూరు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.