ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం.. నావికుడు గల్లంతు
ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబయిలోని డాక్యార్డ్లో ఉన్న ఈ యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతిన్నట్లు నౌకాదళం వెల్లడించింది.
- By RajuLoading...
- | 22 July 2024 4:26 PM GMT
X
ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబయిలోని డాక్యార్డ్లో ఉన్న ఈ యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతిన్నట్లు నౌకాదళం వెల్లడించింది. ఈ ప్రమాద ఘటనలో ఓ జూనియర్ నావికుడు గల్లంతయ్యాడు. అతని కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మిగతా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు నౌకాదళం పేర్కొన్నది. ప్రమాదంలో యుద్ధనౌక ఓవైపు ఒరిగిపోయింది. దీంతో యథాతద స్థితికి తీసుకురావడానికి యత్నించినప్పటికీ విజయవంతం కాలేదని సమాచారం. మరమ్మతుల కోసం డాక్యార్డ్లో ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ముంబయిలోని నౌకాదళ డాక్యార్డులో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రకు మర్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతున్నదని నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
అగ్నిప్రమాదం.. నష్టం వివరాలు రాజ్నాథ్ దృష్టికి
మరోవైపు ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నావికాదళాదిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి పరిస్థితిని వివరించారు. గల్లంతైన నావికుడి క్షేమాన్ని రాజ్నాథ్ కాంక్షించారు. తగిన చర్యలు తీసుకోవాలని నేవీ చీఫ్ను ఆదేశించారు. ఈ మేరకు రక్షణశాఖ మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.